పెనుభూతమైన అనుమానం.. భార్యను కడతేర్చిన కసాయి భర్త..
వివాహేతర సంబంధం ఒకరి ప్రాణాన్ని బలి తీసుకుంది. కట్టుకున్న భార్యను కడతేర్చాడు కసాయి భర్త. మేడ్చల్ జిల్లా గాజులరామారం ప్రాంతంలోని బతుకమ్మ బండలో ఈ విషాద ఘటన జరిగింది. అప్పటివరకు నవ్వులు పూసిన ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కాసేపు సుఖం.. జీవితాలను ఛిద్రం చేశాయి.
నాగర్ కర్నూల్ జిల్లా మరికల్ గ్రామానికి చెందిన సువర్ణ, రాజు పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బ్రతుకుదెరువు కోసం వారు రెండేళ్ల క్రితం ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ వచ్చారు. ఇక్కడే చిన్నాచితకా పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇక్కడి వరకు ఓకే.. సిటీ వచ్చాకే మార్పు వచ్చింది. కలిసి పనికి వెళ్లే సమయంలో భార్య మరొకరితో చనువుగా ఉండటం రాజు గమనించాడు. తీరు మార్చుకోవాలని సూచించాడు. హెచ్చరించాడు.. అయినా వినిపించుకోలేదు.
గత కొంత కాలంగా వీరిద్దరూ కలిసి ఒకే మేస్త్రీ వద్దకు పనికి వెళ్తున్నారు. అక్కడ ఓ వ్యక్తితో సువర్ణ చనువుగా ఉంటుంది. దీంతో భర్త రాజుకు అనుమానం వచ్చింది. అతడితో మాట్లాడొద్దని సువర్ణను హెచ్చరించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. బుధవారం ఇదే విషయమై ఇరువురికి గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన రాజు పార కర్రతో భార్య తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
స్థానికుల సమాచారంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని భర్త రాజును అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.