huzurabad by poll:ఈ నెలలోనే షెడ్యూల్..? వచ్చేనెలలో ఎన్నిక..?
రాష్ట్రంలో ఇప్పుడు హుజురాబాద్ బై పోల్ గురించే చర్చ. ఈటల రాజేందర్ రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికను అన్నీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం దళితబంధు పథకం ప్రవేశపెట్టింది. విధి, విధానాలు బడ్జెట్ కూడా ఖరారు చేయనుంది. బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ప్రచారం చేస్తున్నారు. మరీ మిగతా పార్టీలు మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. కానీ పోరులో తాము కూడా ఉన్నామని చెబుతున్నాయి. దీంతో షెడ్యూల్ రిలీజ్ అంశం చర్చకు దారితీసింది.
ఈ నెలలోనే షెడ్యూల్..
హుజూరాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ ఈ నెలలోనే వెలువడే అవకాశం ఉంది. ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కూడా షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు ఢిల్లీ నుంచి ఇండికేషన్స్ వచ్చాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు గుత్తా సుఖేందర్రెడ్డి, నేతి విద్యాసాగర్, కడియం శ్రీహరి, ఆకుల లలిత, బోడకుంటి వెంకటేశ్వర్లు, ఫరీదుద్దీన్ పదవీకాలం జూన్ 3తో ముగిసింది.
నిబంధనల ప్రకారం అంతకంటే ముందుగా ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. కరోనా వల్ల దేశవ్యాప్తంగా వివిధ స్థానాలకు జరగాల్సిన ఎన్నికలను ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అభిప్రాయం తెలపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాసింది. రాష్ట్రాల అభిప్రాయాలు ఎలా ఉన్నా.. ఖాళీగా ఉన్న లోక్సభ, అసెంబ్లీ, ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఈసీ ఉన్నట్టు తెలుస్తోంది.
హుజురాబాద్ బై పోల్
ఆ జాబితాలో హుజూరాబాద్ కూడా ఉందని తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆగస్టు నెలాఖరు వరకు షెడ్యూల్ విడుదల కావచ్చని, సెప్టెంబరులో ఎన్నికలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. అసెంబ్లీలో టీఆర్ఎస్ సంఖ్యా బలం దృష్ట్యా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు.. ఆ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలవడం లాంఛనమే అవనుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎం శ్రీనివా్సరెడ్డి కూడా జూన్ 16న పదవీ విరమణ చేశారు.
ఈ స్థానం భర్తీపై రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకొని, గవర్నర్కు సిఫారసు చేస్తే సరిపోతుంది. ఈ లెక్కన ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు పార్టీ అభ్యర్థులను షెడ్యూల్ వెలువడిన తర్వాత సీఎం కేసీఆర్ ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రంలో ఇప్పుడే ఏ ఎన్నికలూ వద్దనే ఉద్దేశంతో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేమని సీఎస్ సోమేశ్కుమార్ ఈసీకి తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది.
మారిన రాజకీయ సమీకరణాలు..
ఈటల రాజేందర్ వ్యవహారంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక తప్పలేదు. దళిత బంధు సహా ఇతర ప్రభుత్వ పథకాల ప్రకటనల ఎత్తుగడలు, ప్రతిగా విపక్షాల విమర్శలతో పార్టీల మధ్య యుద్ధ వాతావరణం కంటిన్యూ అవుతోంది.
హుజూరాబాద్ బై పోల్ ఆలస్యంగా జరిగితే, అక్కడ రాజకీయంగా తమకు ప్రయోజనం కలుగుతుందని టీఆర్ఎస్ భావిస్తున్నట్టు సమాచారం. వీలైనంత త్వరగా ఎన్నిక జరగాలని బీజేపీ నేతలు కోరుకుంటున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని ఈసీ కోరింది. ఇందుకు సానుకూలంగా స్పందిస్తే, హుజూరాబాద్ ఉప ఎన్నికకు పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అవుతుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ ఇప్పుడు సాధ్యపడదని ప్రభుత్వం ఈసీకి బదులిచ్చినట్లు తెలుస్తోంది.
Recommended Video
ఎమ్మెల్సీకి అలా..? హుజురాబాద్కు ఓకే
కరోనా థర్డ్ వేవ్ను కారణంగా చూపినట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారులో ఉన్న ఇబ్బంది కూడా ఇందుకు మరో కారణమని సమాచారం. టీఆర్ఎస్ నుంచి ఆశావహులు 20 మందికి పైగానే ఉన్న నేపథ్యంలో వారిలో ఏడుగురిని ఎంపిక చేస్తే మిగిలిన ఆశావహులు, వారి సామాజికవర్గాలకు నిరాశ తప్పదు. దీని ప్రభావం హుజూరాబాద్ ఉప ఎన్నికపై పడే ప్రమాదం ఉంటుంది.
ఈసీ ఏ నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై కొన్ని రోజులు వేచిచూడాల్సి ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. కానీ ఈ నెలలోనే షెడ్యూల్ విడుదల అవుతుందని భావిస్తున్నారు. వచ్చేనెలలో ఎన్నిక, ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేసి.. ఖాళీని భర్తీ చేసే ఉద్దేశంలో ఉన్నారని విశ్వసనీయ సమాచారం.