బోనాల జాతరకు సర్వం సిద్ధం.. గోల్కొండ కోటలో సందడి షురూ
హైదరాబాద్ : ఆషాఢమాసం వస్తోంది. నగరంలో నెలరోజుల సందడి తేనుంది. జులై 4వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బోనాల జాతర తెలంగాణలో వెలుగులు విరజిమ్మనుంది. ఇక భాగ్యనగరంలో బోనాల పండుగ హడావిడి అంతా ఇంతా కాదు. నెల రోజుల పాటు అమ్మవార్లకు సమర్పించే బోనాలు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు.. అలా అన్నీ ప్రత్యేకమే.
బోనాల జాతరకు నగరం ముస్తాబవుతోంది. గల్లీల నుంచి గోల్కొండ దాకా, బస్తీల నుంచి లష్కర్ దాకా, వాడవాడల నుంచి లాల్ దర్వాజ దాకా అమ్మోరి ఆలయాలు ప్రత్యేక శోభను సంతరించుకోనున్నాయి. నెల రోజుల పాటు హైదరాబాద్ చుక్కోలే మెరవనుంది. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటూ భక్తిపారవశ్యంలో మునిగితేలే తరతరాల సంప్రదాయం బోనాల పండుగకు నగరవాసులు సిద్ధమవుతున్నారు.
వామ్మో బైకుల ప్రవాహం.. ఎన్ని బండ్లో లెక్క పెట్టడం కష్టమే (వీడియో)
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రతీక.. బోనాల జాతర
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేదే బోనాల జాతర. అప్పట్లో కలరా, మలేరియా, మశూచి, ప్లేగు వంటి అంటువ్యాధులు ప్రబలి.. చాలామంది ప్రజలు చనిపోయారట. ఆ క్రమంలో గ్రామ దేవతలను కొలుస్తూ నిర్వహిస్తున్న పూజలే బోనాలుగా ప్రసిద్ధిగాంచాయి. అంటువ్యాధులు ప్రబలకుండా సకాలంలో వర్షాలు పడాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మోర్లకు మొక్కడమే బోనాల పరమార్థం.
బోనాల జాతరలో హైదరాబాద్ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. గల్లీగల్లీలో, బస్తీబస్తీలో అమ్మవారి అంశలైన పెద్దమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ తదితర గ్రామదేవతలకు బోనాలు సమర్పిస్తారు. పసుపు కుంకుమలు, చీరసారెలు, భోజన నైవేద్యాలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఇంటిల్లిపాదిని సల్లంగా సూడమ్మా అంటూ వేడుకుంటారు.
గోల్కొండ కోట.. బోనాల వేడుక.. జులై 4 నుంచి స్టార్ట్
ఆనాదిగా వస్తున్న ఆనవాయితీగా తొలుత గోల్కొండ కోటలో బోనాల జాతర ప్రారంభమవుతుంది. ఆ క్రమంలో ఈసారి జులై 4వ తేదీ నుంచి బోనాల జాతర షురూ కానుంది. ఇక్కడ బోనాల జాతరకు అంకురార్పణ జరిగాకే విడతల వారీగా నగరంలో పలుచోట్ల పండుగ నిర్వహించుకుంటారు. జులై 4వ తేదీ గురువారం నాడు గోల్కొండ కోటలో బోనాల జాతర మొదలై ప్రతి ఆదివారం నగరంలో పలుచోట్ల అత్యంత వైభవంగా ఈ గ్రామదేవతల పండుగను జరుపుకుంటారు. అలా ఆగస్టు 1 వ తేదీ వరకు గోల్కొండ కోటలో బోనాల సందడి కొనసాగుతుంది.
నగరవాసులే కాకుండా చుట్టుపక్క జిల్లాలైన మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి కూడా పెద్దసంఖ్యలో భక్తులు బోనాల జాతరలో పాలుపంచుకుంటారు. నగరానికి తరలివచ్చి బోనాల పండుగను వేడుకలా జరుపుకుంటారు. గ్రామదేవతలను భక్తిశ్రద్ధలతో కొలుస్తూ మొక్కులు చెల్లించుకుంటారు. బోనాల సందర్భంగా భక్తులు తమ ఇళ్లను వేపాకులతో అలంకరిస్తారు. ఇతర ప్రాంతాల్లో నివసించే బంధుమిత్రులను పిలుచుకుని బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటారు.
ఆలయాలకు ప్రభుత్వ సాయం.. నెల రోజులు సందడే
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక బోనాలకు మరింత ప్రాధాన్యం పెరిగింది. రిజిస్టర్డ్ ఆలయాలకు అలంకరణ ఖర్చుల కింద ప్రభుత్వం దాదాపు లక్షా యాభై వేల రూపాయలు అందిస్తోంది. దాంతో బోనాలను మరింత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునేందుకు వెసులుబాటు కలిగింది. గతంలో నిర్వహణ ఖర్చులకు భయపడిన ఆలయ నిర్వాహకులు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక బోనాలను ఘనంగా నిర్వహిస్తుండటం విశేషం.
బోనాల జాతర జులై 4వ తేదీన గోల్కొండలో ప్రారంభం కానుండగా.. 21, 22 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో మొదలుకానున్నాయి. అనంతరం 27, 28 తేదీల్లో ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజలో జరగనున్నాయి. అదలావుంటే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
ప్రభుత్వ శాఖల సమన్వయం భేష్.. పోలీస్ డిపార్టుమెంట్ ప్రత్యేకం
ప్రభుత్వ శాఖల సమన్వయంతో హైదరాబాద్లో బోనాల జాతర ప్రతి ఏటా సవ్యంగా జరుగుతోంది. అందులో పోలీస్ శాఖ చొరవ ప్రత్యేకమని చెప్పాలి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. భక్తులు బోనాల పండుగను సామరస్యపూర్వకంగా జరుపుకొనేలా ప్రోత్సాహం అందిస్తున్నారు. సీసీ కెమెరాల నిఘాతో భద్రత పర్యవేక్షిస్తూ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
బోనాల జాతర వేళ ఎవరినీ ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా సహనంతో విధులు నిర్వర్తిస్తున్నారు పోలీసులు. అదలావుంటే బోనాల కోసం ట్రాఫిక్ మళ్లింపు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాట్లు పకడ్బందీగా చేసినట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
8మంది టీచర్లు సస్పెండ్.. ఆ కలెక్టర్ స్టైలే వేరు