ఆఫీసే బార్.. చుక్క, ముక్క.. ఈఎస్ఐ డైరెక్టరేట్ ఉద్యోగుల లీలలు
హైదరాబాద్ : పనిచేస్తున్న కార్యాలయం దేవాలయంతో సమానమంటారు. కానీ వారికి అలాంటివేమీ పట్టదు. ఎంజాయ్ చేయడమొక్కటే తెలుసు. అందుకే ఈఎస్ఐ వైద్యసేవల డైరెక్టరేట్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది. ఆఫీసునే బార్ గా మార్చేశారు అక్కడి ఉద్యోగులు. చుక్క, ముక్కతో మస్తు మజా చేశారు. ఎవరికి తెలియదులే అనుకుంటూ ఖుషీఖుషీగా గడిపారు. చివరకు ఆ పార్టీ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఉద్యోగాలకు ఎసరొచ్చింది.

బార్ ఎందుకు దండగ.. ఆఫీస్ ఉండగా..!
ముషీరాబాద్ ఏరియాలోని గాంధీ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న ఈఎస్ఐ ప్రధాన కార్యాలయం అది. కొందరు ఉద్యోగులు అక్కడ తాము ఆడిందే ఆటగా రాజ్యమేలుతున్నారు. ఎప్పుడూ మద్యం మత్తులో తూలుతుంటారనే ఆరోపణలున్నాయి. ఆఫీస్ టైమింగ్స్ అయిపోగానే బార్ లా మార్చేస్తారనే వాదనలున్నాయి. ఎప్పటినుంచో ఈ తంతు యదేఛ్ఛగా నడుస్తున్నా.. ఇటీవల వీడియో బయటకు రావడంతో ఆ ఉద్యోగుల లీలలు బయటపడ్డాయి.
సీనియర్ ఉద్యోగులమనే కారణంతో తామేమీ చేసినా చెల్లుతుందనేది వారి ధీమా కావొచ్చు. ఏకంగా ఔషదాల కొనుగోళ్లకు సంబంధించిన విభాగంలోనే ఫూటుగా మందు సేవించడం గమనార్హం. డైరెక్టర్ దేవికారాణి ఛాంబర్కు కొన్ని అడుగుల దూరంలో ఇలా ఉద్యోగులు తప్పతాగడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఆఫీసే బార్.. అడ్డంగా దొరికారు
కార్యాలయంలోనే మందు కొడుతూ అడ్డంగా బుక్కయ్యారు అక్కడి ఉద్యోగులు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు డైరెక్టర్ కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదట. డైరెక్టర్ చూసీచూడనట్లుగా వ్యవహరించడంతోనే మందుబాబులు ఇలా రెచ్చిపోతున్నారనే వాదనలున్నాయి. అందుకే ఈసారి కొందరు పక్కా ప్లాన్ ప్రకారమే వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారనే టాక్ వినిపిస్తోంది. విషయం కాస్తా సచివాలయ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సదరు ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు సమాచారం.

మంత్రి ఏమంటారో..! పైరవీలు షురూ?
ఈఎస్ఐ ఉద్యోగుల మందు లీలలపై కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి శశాంక్ గోయల్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దాంతో వెంటనే సంబంధిత శాఖ మంత్రి మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయనే వెంటనే స్పందించి డైరెక్టర్ దేవికారాణిని పిలిచి జరిగిన ఘటనపై ఆరా తీశారట. ఆఫీస్ సూపరింటెండెంట్ వీరన్నగౌడ్, సీనియర్ అసిస్టెంట్లు హర్షవర్దన్, ప్రవీణ్ ఫ్రాన్సిస్, ఉపేందర్ నాథ్ మద్యం సేవించినట్టు ఉన్నతాధికారులు నిర్ధారించారు. దాంతో సదరు ఉద్యోగుల నుంచి వివరణ తీసుకొని వీలైనంత త్వరలో సస్పెన్షన్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఆఫీసులో తాము ఆడిందే ఆటగా రాజ్యమేలుతున్న సదరు ఉద్యోగులు పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన ఓ యూనియన్ లీడర్ ద్వారా కార్మికశాఖ అధికారులను సంప్రదించినట్లు తెలుస్తోంది.

డైరెక్టర్ వెర్షన్.. ఇప్పటికైనా?
ఈఎస్ఐ ఉద్యోగుల తాగుడు బాగోతంపై డైరెక్టర్ దేవికారాణి స్పందించారు. సోషల్ మీడియాలో వైరలయిన వీడియో ద్వారా విషయం తెలిసినట్లు చెప్పారు. మందు తాగుతూ అడ్డంగా దొరికిపోయిన సదరు ఉద్యోగుల నుంచి వివరణ కోరినట్లు తెలిపారు. పూర్తి వివరాలు సేకరించి సోమవారం నాడు ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తానని చెప్పుకొచ్చారు. విధి నిర్వహణలో భాగంగా ఆ రోజు కాస్తా ఆలస్యమైనా ఉండాలని తాము ఆదేశించామని.. అయితే వాళ్లు మద్యం తాగడం మాత్రం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications