హేమంత్ హత్య కేసులో ట్విస్ట్ - రూ.10లక్షల సుపారి - కారులోనే అంతం చేశారు - అవంతి ఫ్యామిలీ అరెస్ట్
తెలంగాణలో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. కూతురు ప్రేమ వివాహం ఇష్టం లేని తల్లిదండ్రులే స్వయంగా అల్లుణ్ని అంతం చేశారన్న కథనాలకు భిన్నంగా అసలు వాస్తవానని పోలీసులు బయటపెట్టారు. అవంతిక కుటుంబీకులు.. కిరాయి హంతకుల ద్వారా హేమంత్ ను అంతం చేయించారని, ఇందు కోసం రూ.10 లక్షలు సుపారీగా ఇచ్చారని పోలీసులు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి మాదాపూర్ ఇన్ఛార్జ్ డీసీపీ వెంకటేశ్వర్లు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అన్ని వివరాలు తెలియజేశారు..

అసలేం జరిగిందంటే..
చందానగర్లోని తారానగర్ కు అవంతి రెడ్డి బీటెక్ చేయగా, యోగ హేమంత్ కుమార్ డిగ్రీ పూర్తి చేసి, ఇంటీరియర్ డిజైనర్ గా బిజినెస్ చేస్తున్నాడు. ఇద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలకు ఇష్టలేకపోవడంతో, ఈ ఏడాది జూన్ 11న కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ వెంటనే చందానగర్ పోలీసులను ఆశ్రయించగా.. ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. కూతురి చర్యను జీర్ణించుకోలేకపోయిన అవంతి తండ్రి.. హేమంత్ ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు.

లక్ష్మారెడ్డి ఇంట్లోనే ప్లాన్..
అవంతి తండ్రి లక్ష్మారెడ్డి ఇంట్లోనే ఈనెల 20న హేమంత్ హత్యకు ప్లాన్ వేశారని పోలీసులు చెప్పారు. ఆ బాధ్యతను బావమరిదైన యుగందర్ రెడ్డికి అప్పగించాడు. ఆ తర్వాత యుగంధర్ రెడ్డి తనకు పరిచయమున్న మాజీ నేరస్తులైన ఎరుకల కృష్ణ, మహ్మద్ పాషా, బిచ్చూ యాదవ్ లను సంప్రదించాడు. రూ.10 లక్షలకు డీల్ కుదుర్చుకుని అడ్వాన్స్ గా లక్ష రూపాయలు చేతిలో పెట్టాడు. ప్లాన్ చేసిన నాలుగు రోజుల తర్వాత కిరాయి హంతకులు దానిని అమలులో పెట్టారు..

నమ్మకస్తుల్లా నటిస్తూ..
పెళ్లి తర్వాత హేమంత్, అవంతి గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు. సడెన్ గా గురువారం(సెప్టెంబర్ 24న) అవంతి ఉంటోన్న ఇంటికి కుటుంబీకులు వచ్చి.. ‘‘మీ నాన్న మీతో మాట్లాడాలనుకుంటున్నారు.. వెంటతీసుకొని రమ్మన్నారు..''అని నమ్మబలికారు. చందానగర వెళ్లాల్సిన కారు రూటు మారడంతో హేమంత్, అవంతిలకు అనుమానం వచ్చింది. వెంటనే కారులో నుంచి దూకే ప్రయత్నం చేశారు. అవంతి తప్పించుకోగలిగినా.. హేమంత్ మాత్రం దొరికిపోయాడు. అవంతి మేనమామ యుగంధర్ రెడ్డితో పాటు మరికొందరు హేమంత్ను మరో కారులో తీసుకెళ్లారు. తప్పించుకున్న అవంతి.. 100 కు డయల్ చేసి పోలీసుల సాయం కోరింది. అదే సమయంలో అత్తమామలకూ సమాచారం అందించింది..

కారులోనే కట్టేసి ఊపిరాడకుండా..
హేమంత్ ను కారులో వెంటబెట్టుకుని జహీరాబాద్ వైపుకు తీసుకెళ్లిన కిరాయి హంతకులు.. మధ్యలో వైన్ షాపు దగ్గర ఆగి, మద్యం కొని, పక్కనే ఉన్న జనరల్ స్టోర్ లో తాడు కూడా కొనుగోలు చేశారు. హేమంత్ ను కారులోనే కట్టేసి చిత్రహింసలు పెట్టారు. చివరికి ఊపిరి ఆడకుండా చేసి హత్యకు పాల్పడ్డారు. ఇదంతా 40 నిముషాల్లోనే జరిగిపోయిందని పోలీసులు చెప్పారు. ఇటువైపు.. అవంతి, హేమంత్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో హేమంత్ ఆచూకీ కోసం పోలీసులు అన్ని ప్రయత్నాలు చేశాం. గురువారం రాత్రి అనుమాని ప్రాంతాల్లో సోదాలు చేపట్టగా గోపన్పల్లిలో తొమ్మిదిమందిని అదుపులోకి తీసుకున్నామని, అవంతి మేనమామ యుగంధర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా హేమంత్ను సంగారెడ్డిలో హత్య చేసి, మృతదేహాన్ని అక్కడే పడేసినట్లు ఒప్పుకున్నాడని డీసీపీ తెలిపారు.

హేమంత్ కేసులో నిందితులు వీళ్లే..
హేమంత్ కుమార్ హత్యకేసులో మొత్తం 13మందిని అదుపులోకి చేసినట్లు డీసీపీ తెలిపారు. వారిని లక్ష్మారెడ్డి, సందీప్ రెడ్డి, రంజిత్ రెడ్డి, రాకేష్ రెడ్డి, సంతోష్ రెడ్డి, విజేందర్రెడ్డి, యుగేందర్ రెడ్డి, స్వప్న, రజిత, స్పందన, అర్చన, సాహెబ్ పటేల్ (డ్రైవర్)గా గుర్తించామని తెలిపారు. హత్యకు వినియోగించన మూడు కార్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి వైద్య పరీక్షల అనంతరం నిందితులను రిమాండ్ కు తరలిస్తామని, పరారీలో ఉన్న కిరాయి హంతకులను, ఇంకొందరు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీసీపీ వెంకటేశ్వర్లు చెప్పారు.

నాకిక అత్తమామలే అమ్మానాన్న..
హేమంత్కు ఆస్తి లేకపోవడమే తమ తల్లిదండ్రులకు నచ్చలేదని భార్య అవంతి చెప్పారు. కొద్ది రోజులుగా ఫాలో చేస్తున్నట్లు అనుమానం రావడంతో జాగ్రత్తగా ఉంటున్నామని, ఫ్యామిలీ వాళ్లు వచ్చి రమ్మని అడిగితే.. ఎక్కువలో ఎక్కువ కొట్టి పంపిస్తారని అనుకున్నాం తప్ప మనిషినే లేకుండా చేస్తారని మాత్రం ఊహించలేదని అవంతి చెబుతున్నారు. తన దృష్టిలో తల్లిదండ్రులు చనిపోయారని, ఇకపై అత్తమామలనే అమ్మానాన్నలుగా చూసుకుంటానని అవంతి కన్నీటిపర్యంతమయ్యారు..

ప్రణయ్-అమృతలా కావొద్దనే..
ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకే తమ కొడుకు హేమంత్ ను అన్యాయంగా చంపేశారని తల్లి ఆదేవన చెందారు. గతంలో మిర్యాలగూడకు చెందిన ప్రణయ్-అమృతల విషాదగాథ నేపథ్యంలో తన కొడుకును కూడా హత్య చేస్తారన్న భయంతోనే ప్రేమ వివాహం వద్దని చెప్పానని ఆమె తెలిపింది. ‘డాడీ.. డాడీ..' అంటూ కొడుకు చివరిసారిగా అన్న మాటలు ఇప్పటికీ గుర్తొస్తున్నాయని, ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని హేమంత్ తండ్రి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications