హైదరాబాద్ వర్ష భీభత్సం- మధ్నాహ్నం మరోసారి : మూసీ నదిలో ముసలి- సినిమా ధియేటర్లోకి వరద..!!
హైదరాబాద్ నగరం భారీ వర్షాలతో తడిసి ముద్దయింది. శుక్రవారం రాత్రి ఏకధాటిగా మూడు గంటల పాటు కురిసిన వర్షానికి జన జీవనం అతలా కుతలం అయింది. నగరంలోని శివారు ప్రాంతాల్లోని లోతట్లు కాలనీ లు జల దిగ్భంధం లో చిక్కుకున్నాయి. కార్పోరేషన్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రాత్రి కురిసిన వర్షానికి ప్రధానంగా ఎల్బీ నగర్..సరూర్ నగర్..లింగోజీ గూడా.. కుర్మ గూడా.. దిలుషుక్ నగర్.. చాదర్ ఘాట్ ప్రాంతాల్లోని అనేక కాలనీలు పూర్తిగా నీటిలో ఉండిపోయాయి.
మరోసారి భారీ వర్షం..ముందస్తు హెచ్చరికలు
ఉదయం నుంచి ఎండ వచ్చి కొంత ఉపశమనం లభిస్తున్నా..మధ్నాహ్నం నుంచి మరోసారి భారీ వర్షం కురుస్తుందనే హెచ్చరికలు నగర వాసులను భయపెడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ హైదర్ గూడా మూసీ నదిలో ముసలి కలకలానికి కారణమైంది. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ముసలి కొండపై ఉండటం స్థానికులు చూసి భయాందోళనకు గురయ్యారు అటవీ శాఖ అధికారులు వచ్చి తీసుకువెళ్లాలని సమాచారం ఇచ్చారు. వెంటనే అటవీ శాఖ అధికారులు స్పందించకపోవటం పైన స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శివగంగా థియేటర్ లోకి వర్షపు నీరు
గతంలో కూడా వర్షం పడినప్పుడు ముసలి కనిపించిందని స్థానికులు తెలుపుతున్నారు మరోసారి వర్షం పడే సరికి బయటికి వచ్చినట్లుగా చెబుతున్నారు.వాగు పక్కనే ఉన్న అపార్టుమెంటు వాసులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక, భారీ వర్షానికి గడ్డిఅన్నారం పరిధిలోని శివగంగా సినిమా ధియేటర్ లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. ధియేటర్ లోని స్క్రీన్ వరకు నీరు చుట్టుముట్టింది. ధియేటర్ లోని కుర్చీలు సైతం కొన్ని నీట మునిగాయి. ధియేటర్ గోడ కూలిపోవటంతో పార్కింగ్ లో ఉన్న వాహనాలు ధ్వంసం అయ్యాయి.
కట్టలు తెగుతున్న చెరువులు..నీటిలోనే కాలనీలు
సమీపంలోని సరూర్ నగర చెరువు కట్ట తెగటంతో ఆ నీరంతా గడ్డి అన్నారం.. పీ అండ్ టీ కాలనీ.. దిలుషుక్ నగర్ వరకు మొత్తం రోడ్ల మీద డివైడర్ల ఎత్తుకు వర్షపు నీరు చేరింది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మోటార్లతో నీటిని తొలిగించే ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వర్షపు నీటిని తప్పించేందుకు మోటార్ల సాయంతో శ్రమిస్తున్నారు. ఇదే సమయంలో ఈ మధ్నాహ్నం నుంచి మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది.
నగర ప్రజలకు గ్రేటర్ హెచ్చరిక
దీంతో.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు సైతం ప్రజలు సాధ్యమైనంత వరకు బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఇక, ఉస్మాన్ సాగర్..మూసీల్లోకి వరద నీరు భారీగా చేరుతోంది. బడంగ్ పేట చెరువు పూర్తిగా నిండిపోయింది. నగరంలోని చెరువులు ఉన్న ప్రాంతాల పరిధిలోని లోతట్టు ఏరియాల్లోని బస్తీ ప్రజలు వరద నీటిలోనే ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది వరదల ప్రభావం..కష్టాలు మర్చిపోలేని నగర వాసులకు ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలు..తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికలు మరింత టెన్షన్ పెంచుతున్నాయి. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా పరిస్థితుల పైన ఆరా తీస్తున్నారు. మధ్నాహ్నం భారీ వర్షం కురుస్తుందని గ్రేటర్ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసారు. ఏదైనా సమస్యలు ఏర్పడితే వెంటనే సమాచారం ఇవ్వాలంటూ ప్రజలకు అధికారులు సూచించారు.