ఆ ఫోటోలు చూసి షాక్... సోదరుడని నమ్మి కష్టకాలంలో ఆదుకున్న పాపానికి...
హైదరాబాద్లో దారుణం వెలుగుచూసింది. వావి వరసలు మరిచిన ఓ దుర్మార్గుడు చెల్లెలి వరసయ్యే యువతి పట్ల పశువులా ప్రవర్తించాడు. కష్ట కాలంలో ఆమె అతనికి డబ్బులిచ్చి మరీ ఆదుకోగా... ఆ కృతజ్ఞత ఏమాత్రం లేకపోగా ఆమె పరువును బజారుకీడ్చాలని చూశాడు. అతని వేధింపులు తాళలేక బాధితురాలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
అసలేం జరిగింది...
పోలీసుల కథనం ప్రకారం... కర్ణాటకలోని బీదర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి(26) కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి ఉద్యోగం వెతుక్కునే పనిలో నిమగ్నమైంది. హైదరాబాద్లోనే ఉండే ఆమె చిన్నమ్మ కుమారులు తరుచూ ఆమె వద్దకు వెళ్తుండేవారు. ఆ ఇద్దరిలో పెద్దవాడైన నిఖిల్(27) ఫిలింనగర్లో నివసిస్తూ రాయదుర్గంలో టైలరింగ్ చేస్తున్నాడు. ఇటీవల డబ్బులు అవసరం కావడంతో ఆ యువతి వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. ఆమె అప్పటికప్పుడు అతనికి రూ.50వేలు ఇచ్చింది.
బలవంతంగా మద్యం తాగించి...
ఇదే క్రమంలో మార్చి 1న మరోసారి ఆ యువతి నిఖిల్ ఇంటికి వెళ్లింది. ఆరోజు నిఖిల్ ఆమెతో బలవంతంగా మద్యం సేవించాడు. మద్యం సేవించాక అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో.. ఆ తర్వాత ఏం జరిగిందో ఆమె గుర్తించలేకపోయింది. మరుసటి రోజు తన ఇంటికెళ్లాక నిఖిల్కు ఫోన్ చేసి బాకీ డబ్బుల గురించి అడిగింది. దీంతో నిఖిల్ షాకింగ్ విషయం చెప్పాడు. తాను డబ్బులు ఇవ్వనని... ఇలాగే ఒత్తిడి చేస్తే తన వద్ద ఉన్న ఫోటోలు బయటపెడుతానని బ్లాక్మెయిల్ చేశాడు.
ఆ ఫోటోలు చూసి షాక్...
ఫోటోలు ఏంటని ఆ యువతి ఆరా తీయగా... 1వ తేదీన ఆమె మద్యం సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్లాక కొన్ని ఫోటోలు తీసినట్లు చెప్పాడు. ఆమె పక్కనే పడుకుని... ఇద్దరు కలిసి ఉన్నట్లుగా తీసిన ఫోటోలను ఆమె వాట్సాప్కు పంపించాడు. దీంతో ఆ యువతి షాక్ తిన్నది. చిన్నమ్మ కుమారుడు,సోదరుడు అన్న నమ్మకంతో కష్టకాలంలో డబ్బులిచ్చి మరీ ఆదుకుంటే అతను ఇంత దారుణానికి పాల్పడుతాడని ఊహించలేకపోయింది. ప్లాన్ ప్రకారమే అతను ఇదంతా చేశాడని గ్రహించింది. ఆ ఫోటోలు లీక్ చేస్తానని పదేపదే అతను బ్లాక్మెయిల్ చేస్తుండటంతో... ఆ వేధింపులు తాళలేక బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు నిఖిల్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.