Hyderabad: నాలుగు ప్యాకేజీలుగా మెట్రో విస్తరణ, ఏయే మార్గాల్లోనంటే?
హైదరాబాద్: మెట్రో విస్తరణకు కసరత్తులు కొనసాగుతున్నాయి. మెట్రో రైలు మూడో దశ ప్రతిపాదిత ప్రాథమిక ప్రాజెక్ట్ నివేదిక(పీపీఆర్), సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్)లు తయారు చేసేందుకు కన్సల్టెంట్ల ఎంపికకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రకటన విడుదల చేసింది. అర్హత కలిగిన ప్రముఖ కన్సల్టెంట్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ(ఆర్ఎఫ్సీ) బిడ్లను ఆగస్టు 28లోగా సమర్పించాలని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కోరారు.
ఇప్పటికే ఆర్ఎఫ్పీ డాక్యుమెంట్లను హెచ్ఎంఆర్ఎల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి రాబోయే 40 నుంచి 50 ఏళ్ల రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని పీపీఆర్, డీపీఆర్ లను దిగ్గజ కన్సల్టెన్సీల ద్వారా సమగ్ర పద్ధతిలో పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

కాగా, ఆగస్టు 28న మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత టెక్నికల్, 30న ఉదయం 11.30 గంటలకు ఫైనాన్షియల్ బిడ్లను తెరవనున్నారు. మరోవైపు, మెట్రో రైలు విస్తరణలో అవుటర్ చుట్టూ మార్గాలను 3 'బీ'గా, మిగితా మార్గాలను 3'ఏ'గా చేట్టాలని నిర్ణయించారు.
పీపీఆర్, డీపీఆర్ రూపకల్పన కోసం ఈ మార్గాలను నాలుగు ప్యాకేజీలుగా విభజించారు.
మొదటి ప్యాకేజీగా పటాన్చెరు-ఇస్నాపూర్(13 కి.మీ), ఎల్బీనగర్-పెద్ద అంబర్పేట(13 కి.మీ), ఓఆర్ఆర్ పటాన్ చెరు-కోకాపేట, నార్సింగి ఇంటర్ఛేంజ్ వరకు నిర్ణయించారు.
రెండో ప్యాకేజీలో శంషాబాద్ జంక్షన్- షాద్నగర్ వరకు (28 కి.మీ), శంషాబాద్ విమానాశ్రయం-తుక్కుగూడ-ఫార్మాసిటీ(26 కి.మీ), ఓఆర్ఆర్ శంషాబాద్-బొంగ్లూరు-పెద్ద అంబర్పేట వరకు (40 కి.మీ) చేర్చారు.
మూడో ప్యాకేజీలో ఉప్పల్-బీబీనగర్ 25 కి.మీ, తార్నాక-ఈసీఐఎల్ 8 కి.మీ, ఓఆర్ఓఆర్ పెద్ద అంబర్పేట-ఘట్కేసర్-శామీర్పేట-మేడ్చల్ వరకు 45 కి.మీ చేర్చారు.
నాలుగో ప్యాకేజీలో.. డబుల్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్, మెట్రో జీబీఎస్-తూంకుంట 17 కి.మీ, ప్యారడైజ్-కండ్లకోయ 12 కి.మీ, ఓఆర్ఆర్ మేడ్చల్ - పటాన్చెరు 29 కిలోమీటర్లను చేర్చారు.












Click it and Unblock the Notifications