ఉపాధ్యాయ నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు: హైకోర్టు కీలక ఆదేశాలు
హైదరాబాద్: ఉపాధ్యాయ నియామకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఉపాధ్యాయ నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లే అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. డీఎస్సీలో మహిళలకు వర్టికల్ విధానంలో రిజర్వేషన్లు అమలు చేయాలన్న విద్యాశాఖ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు వేసిన పిటిషన్పై న్యాయమూర్తి పీ మాధవీదేవి విచారణ జరిపారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. సమాంతర రిజర్వేషన్ అమలు చేయాలని, ఇటీవల గ్రూప్-1లోనూ హైకోర్టు ఇదే తరహా ఆదేశాలు జారీ చేసిందని పిటిషనర్లు వాదించారు. వాదనలు విన్న హైకోర్టు.. సమాంతర రిజర్వేషన్లే అమలు చేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను నవంబర్ 15కి వాయిదా వేసింది.

తెలంగాణ టీఆర్టీ దరఖాస్తుల పొడిగింపు
తెలంగాణ డీఎస్సీ పరీక్ష వాయిదా పడిన నేపథ్యంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష(TRT)కి దరఖాస్తుల స్వీకరణ గడువును విద్యా శాఖ అధికారులు పొడిగించారు. మొత్తం 5089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించే ఈ పరీక్షకు అభ్యర్థులు దరఖాస్తు రుసుం చెల్లించాల్సిన గడువు అక్టోబర్ 20తో ముగియనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అక్టోబర్ 28 వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని వెల్లడించారు. గురువారం వరకు 1.38 లక్షల మంది ఫీజు చెల్లించగా.. వారిలో 1.33 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 20 నుంచి జరగాల్సిన టీఆర్టీ ఆన్లైన్ పరీక్షలను వాయిదా వేశారు.
కాగా, నవంబర్ నెలలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం ప్రకటించింది. మొత్తం 5089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నవంబర్ 20 నుంచి 30 వరకు టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించారు.
అయితే, నవంబర్ 30న ఎన్నికలు జరగనుండటంతో టీఆర్టీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన వెల్లడించారు. అయితే, కొత్త షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల కారణంగానే ఇటీవల తెలంగాణ గ్రూప్-2 పరీక్షలు కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications