కేటీఆర్, కవిత.. చైత్ర ఫ్యామిలీ రోదన వినిపించడం లేదా: ఇందిరా శోభన్
చిన్నారి చైత్ర ఘటన ప్రతీ ఒక్కరినీ కదిలిస్తోంది. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళలు, చిన్నారుల మానప్రాణాలకు రక్షణ కల్పించలేని అసమర్థ సీఎం తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఇందిరా శోభన్ డిమాండ్ చేశారు. సైదాబాద్లో చిన్నారి చైత్ర కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు.
నిరుపేద కుటుంబానికి చెందిన ఆరేళ్ల పాపపై అత్యాచారం, హత్య జరిగి నాలుగురోజులు గడిచినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ పెద్దలెవ్వరూ కనీసం ఘటనపై స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. పేదల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేకుండా పోయిందన్నారు. ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న మంత్రి కేటీఆర్కు.. ఈ ఘటనపై కనీసం ట్విట్టర్లో అయినా స్పందించేందుకు మనసెందుకు రావడం లేదో అర్థం కావట్లేదన్నారు. ముఖ్యమంత్రి కూతురు, ఎమ్మెల్సీ కవిత కళ్లకు ఈ దారుణం కన్పించడం లేదా అని ఆమె ప్రశ్నించారు.
రాష్ట్రానికి హోంమంత్రి ఉన్నాడో లేడో కూడా తెలియని దుస్థితిలో ప్రజలు ఉన్నారని ఇందిరాశోభన్ ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు ఆయన ఒక్కరోజు కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించిన పాపాన పోలేదన్నారు. ఇక మహిళా మంత్రుల విషయం వేరే చెప్పనక్కర్లేదన్నారు. కనీసం మానవత్వం ఉన్నవారెవరైనా ఈ ఘటనపై స్పందిస్తారని, అలాంటిది మహిళలై ఉండి, ఒక్క మంత్రి కూడా ఈ కుటుంబాన్ని ఇప్పటి వరకు పరామర్శించపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
షీటీమ్స్ కూడా నిద్రావస్థలోనే ఉండటం దౌర్భాగ్యమన్నారు. ఘటన మరుకముందే మియాపూర్ లో 13 నెలల పసికందు హత్యకు గురవడం చూస్తుంటే అసలు రాష్ర్టంలో ఏం జరుగుతుందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని.. నిందితుడ్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలన్నారు. చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని, ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకోవాలని ఇందిరాశోభన్ డిమాండ్ చేశారు.
Recommended Video
మరోవైపు మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు రాజు కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితుడి వద్ద సెల్ఫోన్ లేకపోవడం, ఎలాంటి సోషల్ మీడియాను ఫార్మాట్ ఉపయోగించకపోవడంతో ఆచూకీ లభ్యం ఆలస్యమవుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. సీసీ ఫుటేజీ, సొంతూరు, బంధువుల ఇళ్లలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.