ఇస్రో శాస్త్రవేత్త దారుణ హత్య, అసలేం జరిగింది?
హైదరాబాద్: నగరంలోని అమీర్పేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాలానగర్లోని ఇస్రోకు సంబంధించిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ఆర్ఎస్సీ)లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న సురేష్ కుమార్(56)ను కొందరు దుండగులు దారుణంగా చంపారు.
అమీర్పేట డీకే రోడ్డులోని అన్నపూర్ణ అపార్ట్మెంట్లో సురేష్ కుమార్ నివాసముంటున్న ఫ్లాట్లోనే హత్యకు గురయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

20ఏళ్లుగా అమీర్పేటలో..
ఎస్సార్ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన సురేష్ కుమార్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. గత 20ఏళ్లుగా అమీర్పేటలోనే నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

గదికి వెళ్లి బయటకు రాలేదు..
గతంలో అమీర్పేట ఇండియన్ బ్యాంకు శాఖలో మేనేజర్గా పనిచేసిన భార్య ఇందిరకు చెన్నైకి బదిలీ కావడంతో 2005లో ఆమె అక్కడికి వెళ్లిపోయారు. నాటి నుంచి సురేష్ కుమార్ ఒక్కరే ఇక్కడ నివాసం ఉంటున్నారు. కాగా, సోమవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన సురేష్ కుమార్ తన గదికి వెళ్లారు. ఆ తర్వాత బయటకు రాలేదు.

ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో..
మంగళవారం సురేష్ విధులకు హాజరుకాకపోవడంతో తోటి ఉద్యోగులు ఆయనకు ఫోన్ చేశారు. ఎంతకూ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, ఆ తర్వాత స్విచ్ఛాఫ్ రావడంతో అనుమానం వచ్చి చెన్నైలోని సురేష్ భార్యకు సమాచారం అందించారు. వెంటనే చెన్నై నుంచి సురేష్ భార్య ఇందిర, తన కుటుంబసభ్యులతో అమీర్పేటకు చేరుకుంది. పోలీసుల సమక్షంలో సురేష్ కుమార్ గదికి బయటనుంచి వేసిన తాళాన్ని తెరిచి లోపలికి వెళ్లారు. అయితే, అప్పటికే సురేష్ కుమార్ విగత జీవిగా పడివున్నాడు.

దారుణంగా..
తలపై ఏదో వస్తువుతో బలంగా మోదడంతో సురేష్ కుమార్ మృతి చెంది ఉంటారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి డీసీపీ సుమతి, ఏసీపీ తిరుపతన్న వెళ్లి పరిశీలించారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన స్థలం ఆవరణలోని సీసీ ఫుటేజీని పరిశీలించి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications