ఎన్నికల పరేషాన్ : ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు సేమ్ టు సేమ్.. పలుచోట్ల తికమక
ఒకే పేరుతో ఇద్దరుంటే ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందో మనందరికీ అనుభవమే. శీను అనే పేరుతో ఇద్దరుంటే ఎవరిని ఎలా పిలవాలో తెలియక తికమకపడుతుంటాం. అందుకే నల్ల శీను, ఎర్ర శీను అని ఏవో తోకలు తగిలించి పిలుస్తుంటాం. కానీ ఎన్నికల వేళ కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇద్దరు అభ్యర్థుల పేరు ఒకటే కావడం అయోమయానికి దారి తీస్తుంది. అదలావుంటే ఒకచోట ముగ్గురు అభ్యర్థుల పేర్లు ఒకేలా ఉండటం విశేషం.
పేర్లు సేమ్ కావడంతో గెలుపోటములపై ప్రభావం చూపించొచ్చనేది కొందరి వాదన. అయితే వారు పోటీచేసే సింబల్స్ కూడా ఓటర్లు గుర్తుపెట్టుకుంటారుగా అనేది మరో వాదన. మొత్తానికి డబుల్ పేర్లు ప్రధాన పార్టీ అభ్యర్థుల గుండెల్లో గుబులు రేపుతున్నాయట. వీరిని దెబ్బ కొట్టేలా కావాలనే కొందరు స్వతంత్ర అభ్యర్థుల్ని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.
పేర్లు సేమ్.. అంతా అయోమయం
1. తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఆపద్ధర్మ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పోటీచేస్తుండగా.. స్వతంత్ర అభ్యర్థిగా పి.మహేందర్ రెడ్డి అనే వ్యక్తి బరిలో నిలిచారు.
2. నాగర్ కర్నూల్ నుంచి టీఆర్ఎస్ టికెట్ పై మర్రి జనార్దన్రెడ్డి, కాంగ్రెస్ తరపున నాగం జనార్దన్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
3. బోథ్ సెగ్మెంట్ నుంచి టీఆర్ఎస్ నుంచి రాథోడ్ బాపురావు.. కాంగ్రెస్ టికెట్ తో సోయం బాపురావు పోటీలో ఉన్నారు.
4. నకిరేకల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య కాగా.. బీజేపీ తరఫున కాసర్ల లింగయ్య బరిలో నిలిచారు.
5. అశ్వారావుపేట బరిలో టీఆర్ఎస్ నుంచి తాటి వెంకటేశ్వర్లు.. స్వతంత్ర అభ్యర్థిగా సేమ్ పేరుతో తాటి వెంకటేశ్వర్లు అనే మరో వ్యక్తి పోటీపడుతున్నారు.
మరికొన్ని చోట్ల..
6. వికారాబాద్ సెగ్మెంట్ నుంచి ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్.. ఇండిపెండెంట్ గా జి.చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు.
7. సిర్పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ పై కొత్తపల్లి శ్రీనివాస్, బీఎస్పీ టికెట్ పై రావి శ్రీనివాస్ బరిలో నిలిచారు.
8. ఆసిఫాబాద్ స్థానంలో బీజేపీ నుంచి అజ్మీరా ఆత్మారాం నాయక్, బీఎస్పీ నుంచి అజ్మీరా రాంనాయక్ పోటీపడుతున్నారు.
9. ఖానాపూర్ సెగ్మెంట్ లో పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది. ముగ్గురు అభ్యర్థులు సేమ్ పేరుతో ఉన్నారు. టీజేఎస్ నుంచి సత్రా భీంరావు, రిపబ్లిక్ పార్టీ నుంచి ఆత్రం భీంరావు, సీపీఐ నుంచి తొడసం భీంరావు బరిలో నిలిచారు.
ఇక వైరాలో పరిస్థితి ఇంకోలా ఉంది. ఇద్దరు అభ్యర్థుల ఇంటి పేరు ఒకేలా ఉంది. మరో ఇద్దరు అభ్యర్థుల ఇంటిపేరు సేమ్ ఉంది. టీఆర్ఎస్ నుంచి బానోత్ మదన్లాల్, సీపీఐ నుంచి బానోత్ విజయ, సీపీఎం నుంచి భూక్యా వీరభద్రం, బీజేపీ నుంచి భూక్యా రేష్మాబాయి తలపడుతున్నారు.
ఓట్లు ఉల్టా పల్టా అవుతాయా?
అభ్యర్థుల పేర్లు సేమ్ ఉండటం కొంత అయోమయానికి గురిచేస్తోంది. పోలింగ్ సమయంలో అభ్యర్థుల పేర్లతో ఓటర్లు కన్ఫ్యూజయితే అసలుకే ఎసరు వస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆయా పార్టీల కార్యకర్తలు ఓటర్ల దగ్గరకు వెళ్లి తమ అభ్యర్థులకు సంబంధించిన పోలింగ్ గుర్తు, బ్యాలెట్ నెంబర్ పదేపదే చెబుతున్నారట. ఇలా అభ్యర్థుల పేర్లు సేమ్ ఉండటం వెనుక పెద్ద కథ ఉందనే ప్రచారం కూడా ఉంది. ప్రధాన పార్టీల అభ్యర్థులకు చుక్కలు చూపించడానికే సేమ్ పేరుతో ఉన్న వ్యక్తుల్ని కొందరు రంగంలోకి దించుతారనే టాక్ ఉంది. మొత్తానికి డబుల్ పేర్ల ఎన్నికల సిత్రం ఎలాంటి బొమ్మ చూపిస్తుందో మరి.