సికింద్రాబాద్ కు 30 రూపాయలే ఛార్జీ
ప్యాసింజరు రైళ్లు తిరిగి వచ్చాయి. కొవిడ్-19 తర్వాత రైల్వే శాఖ ప్యాసింజరు రైళ్లను ఎక్స్ప్రెస్లుగా మార్చింది. ఛార్జీలను ఎక్కువగా వసూలు చేయడంతో రైల్వేపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అంతేకాదు.. ఛార్జీలను పెంచి చిన్న చిన్న రైల్వేస్టేషన్లను కూడా ఎత్తేశారు. నాలుగేళ్ల నుంచి రైలు ప్రయాణంలో చోటుచేసుకున్న అనేక మార్పులవల్ల సామాన్యులకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. తాజాగా ప్యాసింజర్ రైళ్లను యథావిధిగా నడిపంచడంతోపాటు ఛార్జీలను కూడా పాతవే వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
కాజీపేట నుంచి సికింద్రాబాద్ వరకు పుష్ ఫుల్ రైలులో ప్రయాణం చేస్తే ఛార్జీ రూ.30గా ఉండేది. కరోనా తర్వాత దాన్ని రూ.60 చేశారు. సామాన్యులు, చిరు వ్యాపారులకు దీనివల్ల ఎంతో ఇబ్బందిగా ఉండేది. అయితే గతనెల 27వ తేదీ నుంచి రూ.30 తీసుకుంటున్నారు.

ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించడంతో కాజీపేట నుంచి సికింద్రాబాద్, విజయవాడ, సిర్పూర్ కాగజ్ నగర్ వరకు రైళ్లు కిక్కిరిసి నడుస్తున్నాయి. కాజీపేట నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ కు దూరం 165 కిలోమీటర్లు. ఛార్జీ రూ.80 తీసుకునేవారు. ఇప్పుడు రూ.35 తీసుకుంటున్నారు. భద్రాచలం రోడ్ నుంచి వరంగల్ కు రూ.30తో ప్రయాణం చేయవచ్చు. గతంలో రూ.75 ఉండేది.
సికింద్రాబాదు నుంచి కాగజ్నగర్ వెళ్లే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్.. కాజీపేట- కాగజ్నగర్ల మధ్య ప్యాసింజర్ రైలుగా నడవనుంది. కాజీపేట నుంచి సికింద్రాబాద్ మధ్య మాత్రం ఎక్స్ప్రెస్ రైలుగా నడుస్తుంది. ప్యాసింజరు రైలులో కనిష్ఠ ఛార్జి రూ.5 చేశారు. మొదటి మూడు రైల్వేస్టేషన్ల వరకు ఇదే ఛార్జీ ఉంటుంది. కాజీపేట నుంచి జమ్మికుంటకు రూ.10 అవుతుంది. కాజీపేట నుంచి బస్సులో జమ్మికుంటకు వెళ్లాలంటే రూ.120 అవుతోంది.












Click it and Unblock the Notifications