ఆయన వల్లే సీఎం పదవీ.. కేసీఆర్పై రాములమ్మ విసుర్లు
రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. తాజాగా బీజేపీ ఫైర్ బ్రాండ్ విజయశాంతి కూడా స్పందించారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని సీఎం కేసీఆర్ అవమానించారని మండిపడ్డారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం పెట్టిన భిక్ష వల్లే కేసీఆర్.. సీఎం పదవీని అనుభవిస్తున్నారని గుర్తు చేశారు.
సరికాదు.. కేసీఆర్
పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రెస్మీట్ పెట్టి మరి మాట్లాడిన తీరును చూసి రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారని విజయశాంతి కామెంట్ చేశారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైన పదవీలో ఉండి.. దేశ ప్రధానిని, మహిళా ఆర్థికమంత్రిని అవమానపరిచేలా కేసీఆర్ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. మొదటి నుంచి దళితుల పట్ల ప్రేమ ఉన్నట్లు నటించిన కేసీఆర్, పార్లమెంట్ సమావేశాల ముందు దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడంతోనే ఆయన బండారం బట్టబయలైంది.
రెండుసార్లు డిగ్రీ ఫెయిల్
34 డిగ్రీలు, 6 పీహెచ్ డీలు చేసిన ప్రపంచ మేధావి, స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని కోరడం సరైంది కాదన్నారు. అదీ కూడా 2 సార్లు డిగ్రీ ఫెయిల్ అయిన సీఎం కేసీఆర్ అనడం అంబేడ్కర్ గారిని అవమానపరచడమేనని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 2.3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడగా... కేసీఆర్ అనుభవిస్తున్న సీఎం పదవీ భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పెట్టిన బిక్షేనని గుర్తించాలని సూచించారు. స్వరాష్ట్రం ఏర్పడితే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పి... చివరికి తానే ముఖ్యమంత్రి అయిన దళిత ద్రోహి కేసీఆర్ అని విరుచుకుపడ్డారు.
అంబేద్కర్ విగ్రహాం ఏదీ..?
హైదరాబాదులో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని పెడతానని చెప్పి దళితుల ఓట్లను కొల్లగొట్టి ఇప్పటికీ విగ్రహం పెట్టలేదని చెప్పారు. ఏడేండ్ల ఏలుబడిలో ఏనాడూ అంబేడ్కర్ జయంతి, వర్థంతులకు హాజరై ఆ మహనీయుడి ఫొటోకు పూలదండ వేసిన పాపాన పోలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం అంబేడ్కర్ స్ఫూర్తి కేంద్రాలను పెట్టి భావితరాలకు ఆయన చరిత్రను అందిస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని దళిత సమాజం కేసీఆర్ కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు. రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్ను, రాజ్యాంగాన్ని కించపరిచే అహంకార ముఖ్యమంత్రికి భవిష్యత్లో ప్రజలు తగిన బుద్ది చెప్పడం ఖాయం అని పేర్కొన్నారు.