తెలంగాణలో కైటెక్స్ 2400 కోట్ల భారీ పెట్టుబడి: కేటీఆర్ స్పెషల్ ఫ్లైట్, 40వేల మందికి ఉపాధి
హైదరాబాద్: కేరళకు చెందిన ప్రముఖ వస్త్ర తయారీ పరిశ్రమ కైటెక్స్ గ్రూప్ తెలంగాణ రాష్ట్రంలో భారీ మొత్తంలో పెట్టుబడి పెడుతోంది. రంగారెడ్డి జిల్లా చందన్వెల్లి సీతారామ్పూర్లో ప్లాంటు ఏర్పాటుకు కైటెక్స్ సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, కైటెక్స్ గ్రూప్ మధ్య శనివారం అవగాహన ఒప్పందం కుదిరింది. కాగా, రాష్ట్రంలో తయారీ పరిశ్రమ నెలకొల్పేందుకు సుముఖత వ్యక్తంచేసిన కైటెక్స్ సంస్థ.. రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు గతంలోనే ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు ఎంవోయూ కుదిరింది.
కైటెక్స్ పెట్టుబడుల కోసం ప్రత్యేక విమానం: కేటీఆర్
ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, కైటెక్స్ గ్రూప్ ఎండీ సాబూ ఎం జాకబ్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కేరళకు చెందిన ప్రముఖ దుస్తుల తయారీ కంపెనీ కైటెక్స్ గ్రూపు కేరళ బయట విస్తరణ కోసం చూస్తున్నప్పుడు ఆ సంస్థను తాము సంప్రదించామని తెలిపారు. తమ రాష్ట్రాల్లో ఈ పరిశ్రమ నెలకొల్పాలంటూ కైటెక్స్కు వివిధ ప్రభుత్వాల నుంచి వినతులు, హామీలు వచ్చాయని.. అయితే, తెలంగాణ నుంచి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి ఆ ప్రతినిధులను ఇక్కడకు రప్పించినట్టు చెప్పారు.
కైటెక్స్ రాకతో సుమారు 40 వేల మందికి ఉపాధి..: కేటీఆర్
'రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చిన కైటెక్స్కు కృతజ్ఞతలు. రంగారెడ్డి జిల్లా చందన్పల్లిలో కాకతీయ టెక్స్టైల్ పార్కులో పరిశ్రమ ఏర్పాటుకు కైటెక్స్ సిద్ధమైంది. రూ. 2400 కోట్లపెట్టుబడి పెట్టాలని ఆ సంస్థ నిర్ణయించింది. ఈ పరిశ్రమతో 22వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈ పరిశ్రమలో 85 నుంచి 90శాతం మహిళలకు ఉపాధి దొరుకుతుంది. లక్షల ఎకరాల్లో పండే పత్తిని కైటెక్స్ కొనుగోలు చేయనుంది. కైటెక్స్తో 18వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. సీఎస్ఆర్ కింద రూ.6కోట్ల విలువ చేసే పీపీఈ కిట్లు కైటెక్స్ ఇవ్వనుంది. కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం' అని మంత్రి కేటీఆర్ వివరించారు. కాగా, తెలంగాణ మంత్రి కేటీఆర్ చూపిన చొరవ వల్లే తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నామని కైటెక్స్ గ్రూప్ ఎండీ సాబూ ఎం జాకబ్ తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల అనుకూల వాతావరణం, విధానాలు నచ్చాయని పేర్కొన్నారు. 3 మిలియన్ దుస్తులను ఉత్పత్తి చేసి ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేస్తామని సాబూ ఎం జాకబ్ తెలిపారు.
తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీకి కేటీఆర్ చురకలు
ఇది ఇలావుండగా, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్. ఏఐసీసీ నాయకుడు మాణిక్యం ఠాగూర్ చేసిన ట్వీట్పై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ఆయనకు చురకలంటించారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ను పరుష పదజాలంతో విమర్శించిన రేవంత్ రెడ్డి ఆడియో క్లిప్ బయటపడిన నేపథ్యంలో.. దాన్ని ఉద్దేశించి ఠాగూర్ ట్వీట్ చేశారు. ఓ సంభాషణను జర్నలిస్టు రికార్డు చేసి, దాన్ని అధికారంలో ఉన్న వారికి పంపితే, అలాంటి జర్నలిస్టుల గురించి ఏం ఆలోచించాలి?.. అతడ్ని సుపారీ జర్నలిస్టు అని పేర్కొనొచ్చు అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్పై మంత్రి కేటీఆర్ స్పందించారు. పీసీసీ చీఫ్ పోస్టును విక్రయించిన సుపారీ ఏఐసీసీ ఇంచార్జీల సంగతేంటి? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇది తాను చెప్పడం లేదు.. మీ స్నేహితుడు, కాంగ్రెస్ ఎంపీనే స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చాడు అంటూ ఓ న్యూస్ క్లిప్ను కేటీఆర్ తన ట్వీట్కు ట్యాగ్ చేశారు. జర్నలిస్టులను ఇష్టమొచ్చినట్లు కామెంట్ చేయడం సరికాదంటూ కేటీఆర్ హితవు పలికారు.