రాజగోపాల్ రెడ్డి రాజీనామా: కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవీకి రిజైన్.. ఆ రోజు చేరిక
బుజ్జగింపులు.. సంప్రదింపులు ఫలించలేదు. మునుగోడు ఎమ్మెల్యే పదవీకి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. తెలంగాణ రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీలోని పరిస్థితులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజీనామా ద్వారా మునుగోడు ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తున్నానని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బలహీన పడిందన్నారు. ఈ క్రమంలో పార్టీలో ఉండి కూడా తాను ఏమీ చేయలేకపోయానని తెలిపారు. తన జిల్లాలోనే అవకాశవాద రాజకీయాలు చేసే నేతలు ఉన్నారని కామెంట్ చేశారు. కాంట్రాక్టుల కోసమే కాంగ్రెస్ పార్టీకి తాను రాజీనామా చేస్తున్నానని కొందరు ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజీనామాతో మునుగోడుకు జరిగే ఉప ఎన్నికలో ఎవరు గెలవాలనేది ప్రజలే నిర్ణయిస్తారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
రాజగోపాల్ రెడ్డి ఆగస్టు 7వ తేదీన కాషాయ కండువా కప్పుకుంటారని జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే నిజమైంది. రాజగోపాల్ రెడ్డితో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డి కూడా చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. ఉపఎన్నికతో మునుగోడును డెవలప్ చేయడం, కేసీఆర్కు గుణపాఠం చెప్పడమే తన ఎజెండా అని అంతకుముందే రాజగోపాల్ రెడ్డి అన్నారు.
రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడుతానని గత కొన్ని రోజుల నుంచి హింట్ ఇచ్చారు. ఇవాళ రాజీనామా చేశారు. వెంటనే భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యుహాకర్త సునీల్, దిగ్విజయ్ సింగ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి కూడా చర్చలు జరిపారు. అయినప్పటికీ నో యూజ్.. ఇవాళ రాజీనామా చేసేశారు. ఆయన ఢిల్లీలో అమిత్ షాతో భేటీ కావడంతో బీజేపీలో చేరిక లాంఛనమైపోయింది. ఆ తర్వాతే కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపారు. కొన్ని హామీలను ఇచ్చారు.. ఢిల్లీకి రావాలని కోరిన ఫలితం లేదు.