హైదరాబాదులో అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట విజయ్ దివస్ ఉత్సవాలు..!
దేశం మొత్తం రామమయంతో నిండిపోతోంది. ప్రపంచం యావత్తు అయోధ్య నగరం వైపు చూస్తోంది.దేశంలోని అన్ని నగరాల్లో, గ్రామాల్లో శ్రీరామచంద్రుడి జపం మార్మోగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలు కొత్త కళను సంతరించుకున్నాయి. హిందూ ప్రపంచం పండుగగా భావిస్తోన్న అయోధ్య రామయ్య విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వేళ మన భాగ్యనగరం కూడా శోభాయమానంగా మారుతోంది. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు కృష్ణ ధర్మపరిషత్ నిర్ణయించింది. హిందూ ఐక్యత చాటేలా హైదరాబాద్ వేదికగా ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కృష్ణ ధర్మ పరిషత్ అధ్యక్షులు అభిషేక్ గౌడ్ తెలిపారు.
కృష్ణ ధర్మపరిషత్ (ఆల్ ఇండియా) ఆధ్వర్యంలో ఈ నెల 22న హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం పక్కన, ప్రసాద్ మల్టీప్లెక్స్ సమీపంలో భారీ కార్యక్రమానికి నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. 22న మధ్నాహ్నం 4 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. శ్రీరామ్ పూజతో కార్యక్రమానికి అంకురార్పణ చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో భాగంగా భారీగా తరలి వస్తున్న భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని అభిషేక్ గౌడ్ వివరించారు. భక్తులను పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో నిలిచిపోయేలా గణేష్, శ్రీరామ్, హనుమాన్ కీర్తనలు, పాటలతో భక్తిలహరి ఏర్పాటు చేసామని పేర్కొన్నారు.

ఇదే కాకుండా డాన్స్ ఆర్టిస్ట్తో స్క్రీన్ పై శ్రీరామచరిత ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు అభిషేక్ గౌడ్ తెలిపారు.అయోధ్య ప్రత్యేకత, విశిష్టతను వివరిస్తూ ఆకట్టుకునే డాక్యుమెంటరీని సైతం ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించారు.అదే విధంగా మహాభారతం, పూరీ జగన్నాధ్ శాండ్ ఆర్టిస్ట్ షో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అశేష సంఖ్యలో హాజరయ్యే భక్తులను ఉద్దేశించి ఆల్ ఇండియా కృష్ణ ధర్మపరిషత్ నిర్వాహకుల ప్రసంగాలతో పాటుగా ముఖ్య అతిధి డాక్టర్ కే లక్ష్మణ్ సందేశం ఇవ్వనున్నట్లు తెలిపారు.
కోట్లాది మంది హిందూ భక్త జనం రామ నామంతో దేశం అంతా ఐక్యంగా నిలిచే ఈ అరుదైన, చారిత్రక సమయం వేళ భాగ్యనగరిలో కృష్ణ ధర్మపరిషత్ (ఆల్ ఇండియా) నిర్వహించే ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావాలని అభిషేక్ గౌడ్ పిలుపునిచ్చారు. దేశం మొత్తం రమ్యమైన రామనామంతో పులకరించే ఈ అరుదైన చారిత్రక ఘట్టంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షులు అభిషేక్ గౌడ్తో పాటు కార్యదర్శి సాయిరామ్ యాదవ్, ఉపాధ్యక్షులు అనిష్ గౌడ్, కృష్ణ ధర్మ పరిషత్ ప్రధాన కార్యదర్శి శివారెడ్డి ,కార్యదర్శి అశోక్ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications