తెలంగాణ భవన్లో అగ్నిప్రమాదం... 'ఎమ్మెల్సీ' గెలుపు సంబరాల్లో అపశృతి...
హైదరాబాద్లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి ఘనవిజయం సాధించడంతో పార్టీ శ్రేణులు అక్కడ బాణసంచా కాల్చారు. ఈ క్రమంలో బాణసంచా నిప్పు రవ్వలు పక్కనే ఉన్న ఎండిపోయిన చెట్లపై పడ్డాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
వెంటనే అప్రమత్తమైన టీఆర్ఎస్ శ్రేణులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కార్యకర్తల అత్యుత్సాహమే అగ్ని ప్రమాదానికి కారణమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కాగా,ఎమ్మెల్సీగా సురభీ వాణి దేవి విజయంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో కోలాహలం నెలకొంది. అటు వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానంలో దాదాపుగా టీఆర్ఎస్ విజయం ఖరారవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. దుబ్బాక,జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటముల తర్వాత ఢీలా పడ్డ పార్టీ క్యాడర్లో ఈ విజయం కొత్త జోష్ నింపుతోంది. ఇదే ఊపుతో నాగార్జునసాగర్ ఉపఎన్నికను కూడా కైవసం చేసుకుంటామని ఆ పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.