చూడు చూడ నల్లగొండ.. గుండె మీద ఫ్లోరైడ్ బండ.. అసెంబ్లీలో హరీశ్ పాట
తెలంగాణ అసెంబ్లీలో ఆర్థికమంత్రి హరీశ్ రావు పాట పాడారు. వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన సమయంలో ఆయన నోట పాట వచ్చింది. 'చూడు చూడు నల్లగొండ... గుండె మీద ఫ్లోరైడ్ బండ.. బొక్కలొంకరుబోయిన బతుకులా.. మన నల్లగొండ.. దుఃఖమెల్లాదీసేదెన్నాళ్లు' అని సాంగ్ నల్గొండ బతుకు చిత్రాన్ని పాడారు. నల్లగొండ తాగునీటి కష్టాలను చూసి చలించి సీఎం కేసీఆర్ స్వయంగా రాసిన పాటని మంత్రి చెప్పారు. ఆనాడు ప్లోరైడ్ దుఃఖంమీద ఆవేదనతో పాటరాసిన ఆయనే ఈనాడు ప్లోరైడ్ పీడను శాశ్వతంగా తొలగించారని హరీశ్ రావు తెలిపారు.
నల్లగొండలో ప్లోరైడ్ పీడ అంతమైందని, కొత్తగా ఎవరూ ప్లోరోసిస్ బారిన పడడం లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా ప్రకటించిన విషయాన్ని హరీశ్ రావు తెలిపారు. మిషన్ భగీరథ పథకం నల్గగొండ ప్లోరైడ్ కష్టాలకు చరమగీతం పాడిందని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎండాకాలం వస్తే.. మహిళలు కుండలు పట్టుకుని మైళ్ల దూరం నడిచి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు.
ఆదిలాబాద్ ఆదివాసి ప్రాంతంలో జనం కలుషిత నీరు తాగి డయేరియా వల్ల మరణాలబారిన పడేవారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్ ఐదేళ్లలో తాగునీటి కష్టాలు తీర్చారన్నారు. ప్రభుత్వం పట్టుదలతో పనిచేసి మిషన్ భగీరథ పథకాన్ని వేగంగా పూర్తి చేసిందని వివరించారు. తద్వారా రాష్ట్రంలో అన్ని ఆవాసాలకు శుద్ధి చేసిన సురక్షిత జలాలు ఇంటింటికీ నల్లాల ద్వారా అందుతున్నాయని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.