నిధులు నిలిపివేసి, కేంద్రంపై హరీశ్ రావు ఫైర్..బాధ్యతగానే అప్పులు అంటూ..
సమయం దొరికితే చాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. కేంద్రంపై రాష్ట్రం, టీఆర్ఎస్ సర్కార్పై బీజేపీ నేతల విమర్శల దాడి కొనసాగుతోంది. అయితే మంత్రి హరీశ్ రావు మరోసారి కేంద్రంపై ఫైరయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు. తమ రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.
ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితి పేరుతో రాష్ట్రాలను ఇబ్బందికి గురిచేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రాలను సంప్రదించకుండా కోత ఎలా విధిస్తారని అడుగుతున్నారు. ఈ మేరకు అసెంబ్లీలో హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. నీతి ఆయోగ్ చెప్పిన కేంద్రం వినిపించుకోలేదని తెలిపారు. రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని వివరించారు. రాష్ట్రాల వాటా 42 శాతానికి పెంచామని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది.. కానీ రాష్ట్రానికి 29.6 శాతం వాటా మాత్రమే ఉందన్నారు.
రాష్ట్రానికి రూ.33 వేల 712 కోట్ల నష్టం జరిగిందని హరీశ్ రావు వివరించారు. కేంద్ర ప్రభుత్వం లాగా తాము సంపదను మిత్రులకు పంచలేదని సూచించారు. పేదలకే పంచామని పేర్కొన్నారు. రాష్ట్రంలో గల వెనకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన రూ.1350 కోట్లు పెండింగ్ పెట్టారని పేర్కొన్నారు. వ్యాట్ ఉంటే రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం వచ్చేదన్నారు. జీఎస్టీ వల్ల తెలంగాణ రాష్ట్రానికి నష్టమే జరుగుతుందన్నారు. రాష్ట్ర అప్పుల్లో కలిపి జీఎస్టీ పరిహారం ఇచ్చారని గుర్తుచేశారు.
ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంచుకునే మార్గాలు చూస్తున్నామని హరీశ్ రావు తెలిపారు. తమను కేంద్రం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా.. అభివృద్ధిలో దూసుకెళతాం అని వివరించారు. తాము బాధ్యతగానే అప్పులు చేస్తున్నాం అని తెలిపారు. నిర్లక్ష్యానికి తావులేదని తెలిపారు. అందరీ శ్రేయస్సు కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు.