15 మంది కార్పొరేటర్ల పనితీరుపై కేటీఆర్ అసంతృప్తి.. తీరు మార్చుకోవాలని మందలింపు..
బల్దియా ఎన్నికలకు సమయం ఆసన్నమయ్యింది. నవంబర్ 2వ తేదీన నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలు ఎన్నికలపై ఫోకస్ చేశాయి. ప్రాంతాలు, అభ్యర్థుల, బలాబలాలపై దృష్టిసారించాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన వ్యుహాం, చేసిన పనుల గురించి ప్రస్తావించాలని నిర్దేశం చేశారు. అయితే కొందరు కార్పొరేటర్లు తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోవాలని సుతిమెత్తగా మందలించారు. లేదంటే టికెట్ ఇవ్వడం కష్టం అనేలా సంకేతాలు ఇచ్చారు.

లక్షల కోట్ల పెట్టుబడులు..
బల్దియా ఎన్నికలకు సంబంధించి నేతలతో కేటీఆర్ చర్చించారు. గ్రేటర్ పరిధిలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. హైదరాబాద్కు లక్షల కోట్ల పెట్టుబడులను రప్పించామని తెలిపారు. ఐదేళ్లలో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. అయితే కొన్నిచోట్ల కార్పొరేటర్ల పనితీరు బాగోలేదని చెప్పారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించలేదని పేర్కొన్నారు.

15 మంది పనితీరుపై ఆగ్రహం..
15 మంది కార్పొరేటర్ల పనితీరు బాగోలేదని సమావేశంలో చెప్పారు. నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. సమస్యలు ఉంటే.. ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కానీ మిన్నకుండిపోవడం సరికాదన్నారు. ఎన్నికలు ఎప్పుడూ వచ్చినా అందరూ సంసిద్దులై ఉండాలని కోరారు. కరోనా వైరస్, ఆర్థిక మాంద్యంతో ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు మాత్రం ఆగడం లేదు అని కేటీఆర్ తెలిపారు. ఇవే అంశాలను ప్రజలకు వివరించాలని కోరారు.

జీతాల్లో కోత
మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల్లో కోతలు విధించామని చెప్పారు. సంక్షోభాన్ని అలా నెట్టుకొస్తున్నామని తెలిపారు. అయితే మన నేతన్నలు ఇతర రాష్ట్రాలకు చీరలు ఎగుమతి చేసేస్థాయికి ఎదగడం గర్వంగా ఉందన్నారు. నేతన్నల కోసం వివిధ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. బతుకమ్మ చీరలు వచ్చాయని.. అక్టోబర్ 9వ తేదీ నుంచి పంపిణీ చేస్తామని తెలిపారు. నేతన్నలకు సమస్యలు లేకుండా చూస్తామని భరోసానిచ్చారు.












Click it and Unblock the Notifications