ప్రచారంలో బీజేపీ స్ట్రాటజీ.. తెలంగాణకు అగ్రనేతలు.. మోడీ, అమిత్ షా టూర్ ఖరారు
Recommended Video

హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఆయా పార్టీలు స్టార్ క్యాంపెయినర్లతో బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నాయి. ఈనేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోడీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈనెల 27 తో పాటు వచ్చే నెల 3న మోడీ షెడ్యూల్ ఖరారైంది. 27న నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేశారు రాష్ట్ర బీజేపీ నేతలు. వచ్చే నెల 3న హైదరాబాద్ లో భారీ స్థాయిలో పబ్లిక్ మీటింగ్ నిర్వహించనున్నారు.
మోడీ, అమిత్ షా తో పాటు మరో 38 మందిని స్టార్ క్యాంపెయినర్లుగా ఇటీవల ప్రకటించింది బీజేపీ. తెలంగాణలోని 119 నియోజకవర్గాలు కవరయ్యేలా ప్రచార కార్యక్రమాలు రూపొందిస్తున్నారు రాష్ట్ర నేతలు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా ప్లాన్ చేస్తున్నారు.

మోడీ టూర్.. బీజేపీ ఆశలు
టీఆర్ఎస్ ను దీటుగా ఎదుర్కోవడమే గాకుండా అధికారంలోకి వస్తామని చెబుతున్న రాష్ట్ర బీజేపీ నేతలు మోడీ హవాపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆయన పర్యటన కలిసొస్తుందని నమ్ముతున్నారు. అంతేకాదు మోడీ రాకతో ఎన్నికల వేడి రాజుకుంటుందని చెబుతున్నారు. ఈక్రమంలో రాష్ట్ర పర్యటనకు ఆయన రెండు రోజులే కేటాయించడంతో.. ఇంకా సమయం ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 27న రెండు జిల్లాల్లో పర్యటించేలా షెడ్యూల్ ఖరారు చేశారు. అయితే డిసెంబర్ 3న మాత్రం ఒక హైదరాబాద్ సభ మాత్రమే ఫిక్సయింది. దీంతో మోడీని ఇంకో జిల్లాలో ఎక్కడైనా పర్యటించాలని కోరనున్నట్లు తెలుస్తోంది.

మూడు విడతలుగా అమిత్ షా పర్యటన
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర పర్యటన ఖరారైంది. మూడు విడతలుగా ఆయన షెడ్యూల్ రూపొందించారు. ఈనెల 24, 28 తేదీలతో పాటు డిసెంబర్ 2న అమిత్ షా ప్రచార కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. ఈ మూడు తేదీల్లో నాలుగు చొప్పున మొత్తం 12 బహిరంగ సభల్లో అమిత్ షా పాల్గొంటారు. ఈమేరకు రాష్ట్ర నాయకత్వం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. హైదరాబాద్ లో రోడ్డు షో కూడా ప్లాన్ చేశారు. అమిత్ షా రాక నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లోని నేతలకు దిశానిర్దేశం కూడా చేసినట్లు తెలుస్తోంది.

అమిత్ షా బిజీ షెడ్యూల్
తెలంగాణ పర్యటన మొదటి విడతలో భాగంగా అమిత్ షా ఈనెల 24 రాత్రి హైదరాబాద్ కు వస్తారు. 25 మధ్యాహ్నం 12 గంటలకు పరకాల బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.45 నిమిషాలకు నిర్మల్, 3 గంటల 20 నిమిషాలకు దుబ్బాక, 4 గంటల 45 నిమిషాలకు మేడ్చల్ లో జరగనున్న బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. అనంతరం అదే రోజు రాత్రి ఢిల్లీకి వెళతారు.
ఈనెల 28న తిరిగి రాష్ట్రానికి రానున్నారు అమిత్ షా. మధ్యాహ్నం 12 గంటలకు ఆదిలాబాద్, 2 గంటలకు చౌటుప్పల్ లో జరగనున్న సభలకు హాజరవుతారు. 3 గంటల 45 నిమిషాలకు హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించనున్నారు. లిబర్టీ నుంచి ముషీరాబాద్, అంబర్ పేట మీదుగా ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు రోడ్డు షో జరగనుంది. అనంతరం సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు ఎల్బీ నగర్ లో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. అదే రోజు రాత్రి ఢిల్లీకి పయనమవుతారు.
మూడో విడతలో భాగంగా డిసెంబర్ 2న మరోసారి రాష్ట్రానికి వస్తున్నారు అమిత్ షా. మధ్యాహ్నం 12 గంటలకు నారాయణపేట, 1.35 నిమిషాలకు కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఆమన్ గల్ లో నిర్వహించే సభల్లో ప్రసంగిస్తారు. 3 గంటలకు ఉప్పల్, మల్కాజిగిరి రోడ్డు షో లో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు కామారెడ్డి బహిరంగ సభలో మాట్లాడతారు. దీంతో అమిత్ షా ఎన్నికల ప్రచారం ముగుస్తుంది.












Click it and Unblock the Notifications