వచ్చేవారమే బీజేపీలో చేరిక: ఈటల, మంత్రులు గంగుల, సత్యవతి రాథొడ్ ఫైర్
బీజేపీలో చేరికపై ఈటల రాజేందర్ స్పందించారు. వచ్చే వారం కమల దళంలో చేరతానని చెప్పారు. ఢిల్లీ పెద్దల సమక్షంలో బీజేపీలో చేరుతానని వెల్లడించారు. తాను వామపక్ష, లౌకిక వాదిని.. కానీ పరిస్థితులు తనను అటువైపు తీసుకెళ్లాయని తెలిపారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నించిందని ఆరోపించారు. ఇప్పటికే హుజురాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ రూ.50 కోట్లు ఖర్చుపెట్టిందని తెలిపారు. మంత్రి హరీష్రావు తనకంటే ఎక్కువగా అవమానాలకు గురయ్యారని చెప్పారు. అవమానాలు పడుతున్న మాజీ ఎమ్మెల్యేలు తనతో రావడానికి సిద్ధంగా ఉన్నారని ఈటల రాజేందర్ తెలిపారు.
ఏడేళ్లుగా గుర్తుకురాలేదా..?
మాజీమంత్రి ఈటల రాజేందర్కు ఆత్మగౌరవం ఉందా అని మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. ఏడేళ్లుగా బానిస బతుకు గుర్తుకురాలేదా అని నిలదీశారు. పదవిపోగానే ఈటలకు ఆత్మగౌరవం గుర్తొచ్చిందా అని నిలదీశారు. ఆస్తుల పరిరక్షణ కోసమే ఈటల ఢిల్లీకి వెళ్లాడని, ఈటల ఏం హామీలతో బీజేపీలోకి వెళ్తున్నారని అడిగారు. ఈటల రాజేందర్ చెప్పేవన్నీ అబద్దాలేనని.. కేబినెట్లో ఇవి ఎందుకు చెప్పలేదన్నారు. వ్యక్తిగత అవసరాలు తప్ప బీసీల కోసం ఏనాడూ మాట్లడలేదని దుయ్యబట్టారు. తప్పులు చేశారు కాబట్టే ఈటలను సీఎం కేసీఆర్ పిలవలేదని గంగుల కమలాకర్ తెలిపారు.
ఆ హక్కు లేదు
బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడే అర్హత మాజీ మంత్రి ఈటల రాజేందర్కు లేదని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. ఈటల అధీనంలో ఉన్న పేదల భూములను బాధితులకు ఇప్పించండి అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని కోరుతున్నానని, లేదంటే ఈటల అవినీతికి మీరు మద్దతు ప్రకటించినట్లేనని గంగుల తెలిపారు.
ఆత్మగౌరవం.. తాకట్టు పెట్టారా?
సీఎం కేసీఆర్పై ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సత్యవతి రాథోడ్ ఖండించారు. ఆత్మ రక్షణ కోసమే ఈటల టీఆర్ఎస్కు రాజీనామా చేశారని విమర్శించారు. బీజేపీ కాళ్ల దగ్గర ఆత్మగౌరవాన్ని ఈటల తాకట్టు పెట్టారని చెప్పారు. పార్టీకి, ప్రజలకు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం వల్లే ఈటలపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈటల ఈ స్థాయికి రావడానికి అవకాశం కల్పించింది కేసీఆర్ కాదా? అని సత్యవతి ప్రశ్నించారు.