జగన్పై దాడి కేసులో కొందరికి NIA నోటీసులు
హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో కొందరికి నోటీసులు జారీచేసింది జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ. జగన్ పై దాడి చేసిన శ్రీనివాస రావును 7 రోజుల కస్టడీకి తీసుకున్నారు ఎన్ఐఏ అధికారులు. అందులోభాగంగా గత 5 రోజులుగా విచారిస్తున్న అధికారులు.. మంగళవారం రాత్రి గాంధీ ఆసుపత్రిలో శ్రీనివాసరావుకు వైద్య పరీక్షలు చేయించినట్లు తెలిపారు అతని తరపు న్యాయవాది సలీమ్. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.
జగన్ పై దాడి చేయడం వెనుక ఉన్న పరిణామాలను ఎన్ఐఏ అధికారులకు శ్రీనివాస రావు వివరించాడని తెలిపారు సలీమ్. జగన్ కు సానుభూతి పెరిగి వచ్చే ఎన్నికల్లో ఆయన సీఎం అవుతాడనే కారణంగా ఈ దాడికి పాల్పడినట్లుగా అధికారులకు వెల్లడించినట్లు చెప్పారు. అదలావుంటే శ్రీనివాస రావు కాల్ డేటాపై దృష్టి సారించారు ఎన్ఐఏ అధికారులు. అంతేకాదు అతడు జైల్లో ఉన్నప్పుడు రాసిన 22 పేజీలపై కూడా నజర్ పెట్టారు. ఈక్రమంలో తాజాగా శ్రీనివాస రావు పనిచేసిన విశాఖపట్నం విమానాశ్రయం క్యాంటిన్ ఓనర్ తో పాటు ఇంకొందరికి నోటీసులు జారీ చేశారు.