కల ఫలించినవేళ: 9 ఏళ్ల చిన్నారికి నామకరణం చేసిన సీఎం కేసీఆర్
హైదరాబాద్: తమ బిడ్డకు పేరు పెట్టుకోవాలనే ఆ తల్లిదండ్రుల తొమ్మిదేళ్ల కల ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఫలించింది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన భూపాలపల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన సురేశ్, అనిత దంపతులు 2013లో ఆడ బిడ్డకు జన్మనిచ్చారు.
తమ బిడ్డకు నాటి ఉద్యమ రథసారథి నేటి సీఎం కేసీఆర్తోనే నామకరణం చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు ఈ దంపతులు. ఆ ఆడపిల్లకు ఇప్పటిదాకా పేరు పెట్టకుండానే పెంచుకుంటూ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూధనాచారి ఆ తల్లిదండ్రులను, బిడ్డను ప్రగతి భవన్కు తీసుకువచ్చారు.
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ దంపతులు.. సురేష్, అనిత దంపతులను దీవించి వారి తొమ్మిదేళ్ల ఆడబిడ్డకు 'మహతి' అని నామకరణం చేశారు. తమ ఇంటికి వచ్చిన వారికి స్వయంగా సీఎం దంపతులు బట్టలు పెట్టి సాంప్రదాయ పద్దతిలో ఆథిత్యమిచ్చారు.
అంతేగాక, బిడ్డ చదువుకోసం ఆర్థిక సాయాన్నందించారు. తమ తొమ్మిదేళ్ల కల ఫలించడమే కాకుండా.. ఊహించని రీతిలో తమను ఆదరించి దీవించిన తీరుకు.. సురేష్ కుటుంబం సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యింది. ఈ సందర్భంగా వారు సీఎం దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.