యాసంగిలో వరి కొనం.. కొనుగోలు కేంద్రాలు ఉండవు: మంత్రి ప్రశాంత్ రెడ్డి
యాసంగిలో వరి పంట చుట్టూ రాజకీయాలు సాగుతున్నాయి. పంట మేం కొనం అని కేంద్ర ప్రభుత్వం స్పస్టంచేసింది. దీంతో యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవని తెలంగాణ ప్రభుత్వం తెలియజేసింది. కేంద్రం ప్రభుత్వం ఆదేశాల మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. ఈ మేరకు రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలియజేశారు.
పార్లమెంట్లో టిఆర్ఎస్ ఎంపిలు వరి రైతుల కోసం పోరాటం చేసినా.. కేంద్రం వడ్లు కొనుగోలు చేయమని స్పష్టం చేసిందని వివరించారు. ధాన్యం కొనుగోలు రాష్ట్రం చేతిలో లేదని మంత్రి ప్రకటించారు. నిజామాబాద్ కలెక్టరేట్లో జరిగిన ఉమ్మడి జిల్లా నీటి పారుదల బోర్డ్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. శ్రీరాం సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టుల నుంచి యాసంగి నీటి విడుదల ఖరారు చేశారు. ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల కింద మొత్తం 2.66 లక్షల ఎకరాలకు 23.832 టిఎంసిల నీటిని కేటాయించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.
యాసంగిలో పంటలకు ఢోకా లేదన్న మంత్రి... లాభ సాటి పంటలు పండించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఇతరుల మాటలు నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. అలా చేస్తే ఇబ్బందులు తప్పవని చెప్పారు. వరి పంటను అయితే కొనుగోలు చేయమని మరోసారి కుండబద్దలు కొట్టారు.
పంటకు మద్దతు ధర ఇవ్వాలని దేశంలోని రైతులు అందరూ కోరుతున్న సంగతి తెలిసిందే. 15 కోట్ల మంది రైతులు డిమాండ్ చేస్తున్నారని సీఎం కేసీఆర్ అంతకుముందు తెలిపారు. కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న.. వ్యవసాయ చట్టాలు రద్దు బిల్లు ఆమోదం పొందింది. కానీ మద్దతు ధర గురించి మోడీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.