ఉప్పల్లో లారీ బీభత్సం.. ధ్వంసమైన హనుమాన్ ఆలయం.. ఒకరి మృతి...
హైదరాబాద్లోని ఉప్పల్లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. హబ్సిగూడ-ఉప్పల్ మార్గంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద అదుపు తప్పి బైక్,డీసీఎంను ఢీకొట్టింది. లారీ అతివేగంగా ఢీకొట్టడంతో ఎదురుగా ఉన్న ఆలయంలోకి డీసీఎం దూసుకెళ్లింది. ఈ క్రమంలో డీసీఎం మరో బైక్ను ఢీకొట్టగా ఆ వాహనదారుడు అక్కడికక్కడే చనిపోయాడు.
Recommended Video
వెనకాలే వచ్చిన మరో వాహనం కూడా లారీని ఢీకొట్టడంతో అందులోని నలుగురు గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.లారీ డ్రైవర్ మద్యం మత్తులో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మరో ఘటనలో హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో గురువారం(డిసెంబర్ 31) అర్ధరాత్రి దాటాక కొంతమంది యువకులు రెచ్చిపోయారు. పీకలదాకా మద్యం సేవించిన 10 మంది యువకులు కర్రలు,ఇనుప రాడ్లతో రోడ్ల పైకి వచ్చి హల్చల్ చేశారు. రోడ్డున పోయే వాహనదారులను భయభ్రాంతులకు గురిచేశారు. కొంతమంది వాహనదారులపై రాళ్లతో దాడి చేశారు. వాళ్లల్లో వాళ్లే ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. మొత్తంగా ఆ ప్రాంతంలో రాత్రిపూట పెద్ద హంగామానే సృష్టించారు.యువకుల హల్చల్పై పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే వారు పరారైనట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
కొత్త సంవత్సరం వేళ రంగారెడ్డి జిల్లాలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. శంకర్పల్లి మండలం ఎల్వర్తి వద్ద ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టడంతో డ్రైవర్తో పాటు క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు.మృతులను మహారాష్ట్రకు చెందిన సింకిందర్సింగ్(34), అలీఖాన్ పఠాన్ (30)గా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.