coronavirus: తెలంగాణలో ఒకే ఒక్క కేసు: దుష్ప్రచారం వద్దంటూ మంత్రి ఈటెల స్పష్టత
హైదరాబాద్: గత రెండ్రోజుల్లో ఒక కరోనా కేసును మాత్రమే గుర్తించామని, ఇప్పటి వరకు కొత్త కేసు తెలంగాణలో నమోదు కాలేదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికే కరోనా సోకిందని.. రాష్ట్రంలో ఉన్న ఏ వ్యక్తికి కూడా కరోనా రాలేదని స్పష్టం చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి మాత్రమే కరోనా ఉందని తేలిందన్నారు.
coronavirus: రహేజా ఐటీ పార్క్ ఖాళీ, ఉద్యోగులు ఇక వర్క్ ఫ్రమ్ హోం, గాంధీకి అనుమానితుల తాకిడి
తెలంగాణలో ఒకటే కేసు.. ఇద్దరు అనుమానితుల రిపోర్టులు పుణెకు..
తెలంగాణలో ఒక కరోనా కేసు మాత్రమే నమోదైందని.. ఇద్దరు అనుమానితులు శాంపిల్స్ పుణెకు పంపించామని తెలిపారు. వారి రిపోర్టులు వచ్చాక ప్రకటిస్తామని తెలిపారు. ఇటలీ నుంచి వచ్చిన యువతికి, అపోలో ఆస్పత్రి శానిటేషన్ వర్కర్కు సంబంధించిన రిపోర్టులను పుణెకు పంపించామన్నారు. మంగళవారం మొత్తం 47 మందికి పరీక్షలు చేస్తే 45 మందికి నెగిటివ్ వచ్చిందని, వారిని డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. మరో ఇద్దరికి సంబంధించిన రిపోర్టులను పుణెకు పంపించామని తెలిపారు. గురువారం సాయంత్రంలోగా ఆ రిపోర్టులు వస్తాయన్నారు మంత్రి ఈటెల రాజేందర్. రిపోర్టులు వచ్చాక ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. ల్యాబ్స్ కేంద్రం అధ్వర్యంలో పనిచేస్తాయని, కేంద్రమే కరోనా కేసులను ప్రకటిస్తుందని చెప్పారు.
కరోనాపై దుష్ప్రచారం వద్దు..
కొంతమంది కరోనాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఈటెల మండిపడ్డారు. ప్రజలు వదంతులు నమ్మవద్దని సూచించారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకుని ప్రజలు సహకరించాలన్నారు. మీడియా కూడా సంయమనంతో వ్యవహరించాలన్నారు. ప్రజలను అవాస్తవాలతో భయభ్రాంతులకు గురిచేయవద్దని కోరారు.
మహింద్రా హిల్స్ కుటుంబంలో మిగితా అందరికీ నెగెటివ్..
మహేంద్ర హిల్స్లో ఒక కుటుంబంలోని వ్యక్తికి కరోనా లక్షణాలున్నాయని, ఆ కుటుంబంలో నలుగురికి కూడా కరోనా నెగిటివ్ వచ్చిందని మంత్రి ఈటెల తెలిపారు. స్థానికులు ఆ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. ఆ కుటుంబానికి చెందిన ఇంటి కిటికీలు కూడా మూసేయాలంటూ కోరడం సరికాదన్నారు. అక్కడ ఇప్పటికే శానిటేషన్ నిర్వహించామన్నారు.
గాలి ద్వారా కరోనా వ్యాపించదు..
ఒకరికి కరోనా లక్షణాలున్నాయని, మైండ్ స్పేస్ ఖాళీ చేస్తున్నారని.. అవాస్తవాలను ప్రచారం చేయొద్దని మంత్రి కోరారు. బస్సులు ట్రైన్లలో ప్రయాణించినా వైరస్ రాదని అన్నారు. కరోనా సోకిన వారు దగ్గరగా తుమ్మినా, దగ్గినా వస్తుందని అన్నారు. అవగాహన కోసం పాంప్లెంట్లు, ఫ్లెక్సీలు, హోర్డింగులు భారీ ఎత్తున ఏర్పాటు చేశామన్నారు. 104కు కాల్ చేసి ప్రజలు అనుమానాలను తీర్చుకోవచ్చన్నారు.