audio:పైలట్ రోహిత్ రెడ్డితో రామచంద్రా భారతి- బీఎల్ సంతోషే ఆర్గనైజర్..
మొయినాబాద్ ఫామ్ హౌస్ ఇన్సిడెంట్లో ఆడియో వెలుగులోకి వచ్చింది. సమావేశానికి ముందు పైలట్ రోహిత్ రెడ్డితో రామచంద్ర భారతి మాట్లాడారు. ఆ ఆడియో ఇప్పుడు బయటకు వచ్చింది. అందులో ఎమ్మెల్యేల కొనుగోలు అంశం గురించి ఉంది. పైలట్ రోహిత్ రెడ్డి భయపడుతూనే మాట్లాడారు. బీఎల్ సంతోష్ తమ ఆర్గనైజింగ్ సెక్రటరీ అని రామచంద్ర భారతి చెప్పారు. తమ వ్యవహారాలు ఆయనే చూసుకుంటారని పేర్కొన్నారు.
ఎమ్మెల్యేలు తమకు కావాలని.. ఒకరిద్దరు వస్తే బాగుంటుందని రామచంద్ర భారతి అన్నారు. అందుకు రోహిత్ రెడ్డి రియాక్ట్ అవుతూ.. తమ సీఎం కేసీఆర్ గురించి తెలుసు కదా అన్నారు. ఆయన చాలా దూకుడుగా ఉంటారని.. తమకు ప్రాబ్లమ్ అవుతుందని పేర్కొన్నారు. తమ ఫ్యూచర్, కెరీర్ నాశనం అవుతుందని చెప్పుకొచ్చారు.
ఈ విషయాన్ని టాప్ సిక్రెట్గా ఉంచాలని రోహిత్ రెడ్డి కోరారు. లేదంటే తమ పని అయిపోతుందని చెప్పారు. అబ్బే.. బయటకు రాదని రామచంద్రా భారతి తెలిపారు. మీరు మా స్కానర్లో ఉన్నారని భరోసా ఇచ్చారు. కేంద్రం నుంచి మీకు పూర్తి భరోసా ఉంటుందని వివరించారు. ఐటీ నుంచి ఈడీ వరకు.. మీ భద్రతను చూసుకుంటామని తెలిపారు. అలా కాసేపు మాట్లాడిన తర్వాత రోహిత్ చల్లబడ్డారు. బేరానికి అంగీకరించినట్టు మాట్లాడారు.
ప్రభుత్వ ఏర్పాట్లకు సంబంధించి అన్నింటిని సంతోష్ చూసుకుంటారని రామచంద్రా భారతి తెలిపారు. నంబర్ 1, నంబర్ 2 సంతోష్ ఇంటికి వచ్చి కలుస్తారని వివరించారు. 25వ తేదీన గ్రహణం ఉందని.. మరో రోజు కలుద్దామని తెలిపారు. 26వ తేదీ తర్వాత ఎక్కడైనా కలుద్దాం అని.. హైదరాబాద్లో వద్దని చెప్పారు. ఆ మేరకు మొయినాబాద్ ఫామ్ హౌస్లో కలిసి ఉంటారు. ఆ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది.