విజయోత్సవ ర్యాలీ: ఈటల రాజేందర్పై కేసు నమోదు
కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘణ కింద కేసు నమోదైంది. విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నందుకు హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్తో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదు చేశామని కరీంనగర్ పోలీసులు తెలపారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మంగళవారం రాత్రి తన అనుచరులతో కలిసి కరీంనగర్లోని ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి కోర్టు చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చారన్నారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈటల రాజేందర్, ఆయన అనుచరులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నేతలు వందల కోట్లు ఖర్చు పెట్టారు. డబ్బులు ఖర్చు పెట్టటమే కాకుండా ప్రజలను వేధింపులకు గురిచేశారు. భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు దండుకోవాలని చూశారు. కానీ ప్రజలు ఏమాత్రం లొంగలేదు. ఇది హుజూరాబాద్ ప్రజల గొప్పతనం అని ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్లో ప్రజలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితిని కల్పించి భయపెట్టారు. మద్యం ఏరులైపారించారు. పోలీసు ఎస్కార్టులో మద్యాన్ని హుజూరాబాద్ నియోజకవర్గం అంతా తరలించారు. కోట్ల రూపాయల డబ్బులు వెదజల్లారు.ఎన్ని చేసినా ప్రజలు నా వైపు నిలబడ్డారు. కుల సంఘాలతో అందరికీ డబ్బులిచ్చారు.. అయినా ఎవరూ లొంగలేదని అన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా దళితుల బస్తీలకు వెళ్లిన సమయంలో దళిత బంధు ఇస్తే మాత్రం మేం లొంగిపోతామా బిడ్డా..పది లక్షలకు అమ్ముడుపోతామా బిడ్డా అని అన్నారని అది వారి నిజాయితీకి నిలువుటద్దం అని గుర్తుచేశారు. కులాల ప్రస్తావనతో ప్రజలను వేరుచేసి ఓట్లు దండుకోవాలని టీఆర్ఎస్ కుట్రలను ప్రజలు తిప్పికొట్టారని..ప్రజలు తన వైపే నిలబడ్డారని అన్నారు. ఈ విజయం హుజూరాబాద్ ప్రజలకు అంకితం చేస్తున్నానని ప్రకటించారు. హుజూరాబాద్ ప్రజలకు తన చర్మం ఒలిచి, వాళ్లకి చెప్పులు కుట్టించినా వారి రుణం తీర్చుకోలేనని ఈటల భావోద్వేగానికి గురయ్యారు.
ఎన్ని కుట్రలు చేసినా ప్రజల తీర్పుతో నాకు విజయం అందించారు. కుట్రదారులు కుట్రలలోనే నాశనం అయిపోతారు. కుట్రలు ఎక్కువ కాలం నిలవవు. 2 గుంటల మనిషి 4 వందల కోట్ల డబ్బు ఎలా ఖర్చు పెట్టాడు?అంటూ ప్రశ్నించారు. నాకు అండగా నిలిచిన నియోజకవర్గ ప్రజలకునేను సర్వదా రుణపడి ఉంటాయని వారికి నా కృతజ్ఞతలు అని తెలిపారు.
కొందరు తన గెలుపు కోసం సీక్రెట్ గా సపోర్ట్ చేశారని.. వాళ్ల పేర్లు మాత్రం చెప్పనని ఈటల కామెంట్ చేశారు. తనంతట తానుగా టీఆర్ఎస్ నుంచి బయటకు రాలేదని.. తనను వెళ్లగొట్టారని ఈటల అన్నారు. తాను ఇంత వరకూ తప్పు చేయలేదని.. ఇకపై చేయబోనని.. ఎప్పటికైనా ప్రజల నోట్లో నాలుకలా ఉంటానని.. ఏ పదవి వచ్చినా వన్నె తెచ్చే నాయకుడిని తాను అని వివరించారు. తెలంగాణ బిల్లు పాసైనప్పుడు తన జీవితం ఓ సారి ధన్యమైందని.. ఇప్పుడు మరోసారి అదే అనుభూతి కలుగుతోందని ఈటల రాజేందర్ చెప్పారు. ఈ మొత్తం విజయాన్ని హుజూరాబాద్ ప్రజలకే అంకితం చేస్తానని.. తన ఓటర్లను కంటికి రెప్పలా కాపాడుతానని ఈటల చెప్పారు. తనను ప్రజలంతా నిండు మనసుతో ఆశీర్వదించారని.. వారందరికీ కృతజ్ఞతలనీ అన్నారు.












Click it and Unblock the Notifications