Raja Singh: జైలుకు పంపినా భయపడేది లేదు: రాజా సింగ్
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు మరోసారి పోలీసులు నోటీస్ జారీ చేశారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు పోలీసుల నోటీసులు వస్తునే ఉన్నాయి. తాజాగా పోలీసులు రాజా సింగ్ కు మరో నోటీసు జారీ చేశారు. ఈనెల 29న ముంబైలోని దాదర్ లో జరిగిన ఓ ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు ఆ నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. హైకోర్టు విధించిన షరతులను రాజాసింగ్ ఉల్లంఘించారని.. రెండు రోజుల్లో వీటిపై సమాధానం చెప్పాలని కోరారు. ఈ నోటీసులపై రాజా సింగ్ స్పందించారు. రాష్ట్రాన్ని ఎనిమిదో నిజాం పాలిస్తున్నారని ఆరోపించారు.
భయపడేది లేదు
పోలీసులు జైలుకు పంపినా భయపడేది లేదని రాజా సింగ్ స్పష్టం చేశారు. ధర్మం కోసం చావడానికైనా సిద్ధమని.. గోహత్య, మతమార్పిడులు, లవ్ జీహాద్పై చట్టం తీసుకురావాలన్నారు. ముంబైలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడితే మంగళహట్ పోలీసులు నోటీసులు ఇవ్వడం ఆశ్చర్యపరుస్తుందని చెప్పారు. వారం క్రితం కూడా రాజా సింగ్ కు పోలీసులు నోటీస్ ఇచ్చారు. గతేడాది అజ్మీర్ దర్గాపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు కంచన్ భాగ్ పోలీస్ స్టేషన్ లో రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు.
మహ్మద్ ప్రవక్తపై
ఇందుకు సంబంధించి రాజా సింగ్ కు నోటీసులు ఇచ్చారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో గత ఆగస్ట్ లో రాజా సింగ్ ను అరెస్ట్ చేశారు. స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ షో నిర్వహణపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన రాజాసింగ్ మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆ వీడియోను సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు రాజా సింగ్ ను అరెస్ట్ చేశారు. 2004 రాజాసింగ్ పై 101 కేసులు నమోదయ్యాయని, ఇందులో క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని పోలీసులు చెప్పారు.
బెయిల్
దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉన్న రాజా సింగ్ కోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చారు. కోర్టు రాజా సింగ్ కు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. రాజా సింగ్ జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత ఆయనకు పలు మార్లు పోలీసులు నోటీసులు జారీ చేశారు.