ప్రజాకూటమికి 75-80 సీట్లు వస్తాయి...12న ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
Recommended Video
హైదరాబాదు: తెలంగాణలో ప్రజాకూటమికి 75 నుంచి 80 సీట్లు వస్తాయని కాంగ్రెస్ ఛీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు.తెలంగాణలో ఎన్నికల తర్వాత ప్రజాకూటమి నేతలు తొలిసారిగా మీడియా సమావేశం నిర్వహించారు. కొన్ని జాతీయ ఛానెళ్లు బీజేపీకి మద్దతు తెలుపుతాయని అన్నారు. వాటి సర్వేలను తాము పట్టించుకోబోమని స్పష్టం చేశారు. ఈనెల 12న ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు మిగతా నాలుగు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
శుక్రవారం జరిగిన పోలింగ్ సరళిని పరిశీలిస్తే ప్రజాకూటమికి ప్రజలు మద్దతు తెలిపినట్లుగా స్పష్టమవుతోందన్నారు. నాలుగున్నర ఏళ్లపాటు ప్రజలను మోసం చేసిన టీఆర్ఎస్ సర్కార్పై వ్యతిరేకత ఏర్పడిందన్నారు. ఇండియాటుడే ఫలితాలు చూసి కంగారపడొద్దు అని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఫలితాలు మారే అవకాశం కూడా ఉందని రాజ్దీప్ సర్దేశాయ్ చెప్పినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. ఈసీ చాలా విషయాల్లో తప్పుచేసిందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్ట్రాంగ్ రూంలలో ఈవీఎంలను భద్రపరిచాకా అధికారులు కూడా లోపలికి వెళ్లరాదని చెప్పారు. స్ట్రాంగ్ రూంలో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశముందన్న అనుమానం లేవనెత్తిన ఉత్తమ్ తమ కార్యకర్తలను స్ట్రాంగ్ రూం దగ్గర ఉండేందుకు అనుమతివ్వాలని ఉత్తమ్ అన్నారు.ఓటరు లిస్టులో చాలా తప్పులు దొర్లాయని చెప్పారు. దాదాపు లక్ష ఓట్లు వరకు గల్లంతయ్యాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సెమీ ఫైనల్స్లో అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్నే గెలుపు వరిస్తుందన్నారు. కౌంటింగ్ దగ్గర ఈవీఎంలను అన్నిటినీ చెక్ చేసి ఫలితాలు వెల్లడించాలి.
కేసీఆర్ అహంకారంతోనే ముందుస్తు ఎన్నికలకు వెళ్లాడని అందుకే ప్రజలంతా మహాకూటమి వైపు మొగ్గు చూపారని చెప్పారు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో కేసీఆర్ 51 నెలల్లో దోపిడీ చేశారని మండిపడ్డారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చరని తాము ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లినట్లు రమణ వెల్లడించారు. కూటమికి ప్రజలు అనుకూలంగా ఉన్నారు కాబట్టే... గతం కంటే ఇప్పుడు ఓటింగ్ శాతం పెరిగిందన్న రమణ....ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకండా అమలు చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్తో కలిసి ఎన్నికలకు వెళ్లలేదని అయితే ప్రజలకోసమే కలిశామని చెప్పారు.