వివాహితపై రేప్, దంపతుల కిడ్నాప్: సీఐ నాగేశ్వరరావు అరెస్ట్, శిక్షించాలని టీజీ వెంకటేశ్ డిమాండ్
హైదరాబాద్: వివాహితపై అత్యాచారం, కిడ్నాప్ కేసులో పరారీలో ఉన్న మారేడ్పల్లి ఇన్స్పెక్టర్ కే నాగేశ్వరరావును రాచకొండ ఎస్ఓటీ, వనస్థలిపురం పోలీసులు ఆదివారం రాత్రి కస్టడీలోకి తీసుకున్నట్లు ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోందని, నిందితుడ్ని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.
వివాహితను రేప్ చేసిన సీఐ నాగేశ్వరరావు, ఆపై కిడ్నాప్
జూన్ 6న వివాహితపై అత్యాచారం చేసి, బాధితురాలితోపాటు ఆమె భర్తను కిడ్నాప్ చేసి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని ఎల్మినేడుకు తీసుకెళుతుండగా కారు ప్రమాదానికి గురైంది. కారు నడుపుతున్న నాగేశ్వరరావుకు ప్రమాదంలో గాయాలు కావడంతో బాధిత దంపతులిద్దరూ తప్పించుకుని వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నాగేశ్వరరావు చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది.
సీఐ నాగేశ్వరరావును సస్పెండ్ చేసిన సీపీ సీవీ ఆనంద్
ఈ క్రమంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సీఐని సస్పెండ్ చేశారు. ప్రమాదంలో గాయపడిన సీఐ నాగేశ్వరరావు మొదట అజ్ఞాతంలోకి వెళ్లాడు. బాధితులతో మాట్లాడి రాజీ కుదుర్చుకునేందుకు యత్నించాడు. దీంతో కేసును సీరియస్ తీసుకున్న ఉన్నతాధికారులు.. నిందితుడు నాగేశ్వరరావును పట్టుకునేందుకు మూడు పోలీసు బృందాలను రంగంలోకి దించారు. నిందితుడ్ని కేసు నుంచి తప్పించుకునేందుకు పెద్దలు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీంతో కేసు తీవ్రతను తగ్గించేందుకు మరో ఉన్నతాధికారి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. బాధితులతోనూ మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది.
Recommended Video
సీఐ నాగేశ్వరరావును శిక్షించాలంటూ టీజీ వెంకటేశ్ డిమాండ్
మరోవైపు, తనను అక్రమంగా ఓ భూవివాదంలో ఇరికించారని నాగేశ్వరరావుపై కర్నూలుకు చెందిన మాజీ ఎంపీ, బీజేపీ నేత టీజీ వెంకటేశ్ ఆరోపించారు. నాగేశ్వరరావు తాజా దురాగతం గురించి తనకు మీడియా ద్వారా తెలిసిందని చెప్పారు. ఈ మేరకు మెక్సికోలో ఉన్న టీజీ వెంకటేశ్ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. హైదరాబాద్లో ఓ భూ వివాదంతో తనకు సంబంధం లేదని బాధితులు రాసిచ్చినా తన పేరును చేర్చినట్లు వెంకటేశ్ తెలిపారు. నాగేశ్వరరావుపై ఉన్నతాధికారులు, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని టీజీ వెంకటేశ్ డిమాండ్ చేశారు.