'గేమ్ ఛేంజర్' ను సిద్ధం చేసిన సీఎం రేవంత్ రెడ్డి!
హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు గేమ్ ఛేంజర్ అయితే.. తెలంగాణకు రీజనల్ రింగు రోడ్డు (RRR) సూపర్ గేమ్ ఛేంజర్ అవబోతోంది. రాష్ట్ర ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు కూడా దీన్ని స్పష్టం చేస్తున్నాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయని, రహదారి మంజూరై నాలుగు సంవత్సరాలైనప్పటికీ ప్రభుత్వ అసమర్ధతవల్లే పనులు సాగలేదన్నారు. తమ ప్రభుత్వం వాటిని మూడు సంవత్సరాల్లోనే పూర్తిచేయబోతోందన్నారు.
ఉత్తర భాగానికి సంబంధించి ప్రభుత్వం భూసేకరణను ముమ్మరం చేసిందని మంత్రి వెల్లడించారు. అలాగే దక్షిణ భాగానికి సంబంధించి త్వరలోనే జాతీయ రహదారి నెంబరు రాబోతోందన్నారు. ఆ మార్గంలో కూడా భూసేకరణ ఉంటుందన్నారు. ఆర్ఆర్ఆర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు రీజనల్ రింగు రోడ్డు చుట్టూ రింగ్రైలు ప్రాజెక్టుతోపాటు ఫార్మా కంపెనీలు, ఐటీ క్లస్టర్లు ఏర్పాటు చేయబోతోంది. ప్రస్తుతం ఉన్న ఔటర్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఆర్ఆర్ఆర్ నిర్మించబోతున్నారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి తెలిపాయి. తెలంగాణలోని పలు జిల్లాలను కలుపుతూ 340 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం జరగనుంది.

సంగారెడ్డి-నర్సాపూర్-తూప్రాన్-గజ్వేల్-యాదాద్రి-చౌటుప్పల్ వరకు 158 కిలోమీటర్ల ఉత్తర భాగం, చౌటుప్పల్-చేవెళ్ల-శంకర్పల్లి-ఆమనగల్-సంగారెడ్డి వరకు 182 కిలోమీటర్ల దక్షిణ భాగానికి కేంద్రం అనుమతిచ్చింది. ఉత్తర భాగానికి ఇప్పటికే జాతీయ రహదారి నెంబర్ కేటాయించారు. దక్షిణ భాగానికి కూడా నెంబర్ కేటాయించబోతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ప్రకటించారు. ఇది పూర్తయితే తెలంగాణ ముఖచిత్రమే మారిపోనుంది. నవ తెలంగాణ ఆవిర్భవిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. రైల్వే లైనుతోపాటు చుట్టూరా వివిధ ప్రాజెక్టులతో ఆ ప్రాంతాలన్నీ గణనీయంగా అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకనుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.












Click it and Unblock the Notifications