అనుభవాలు చెప్పండి.. రివార్డు పట్టండి, సజ్జనార్ కొత్త ఆఫర్
ఆర్టీసీలో పలు మార్పులను తీసుకు వచ్చారు సజ్జనార్.. ఎండీగా బాధ్యతలు స్వీకరించినప్పటీ నుంచి ఏదో కొత్త పనులు చేపడుతున్నారు. తాజాగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సంస్థను ప్రోత్సహిస్తూ ప్రయాణికులు సురక్షితంగా గమ్యం చేరాలని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ప్రజలను కోరారు. ప్రజారవాణా వ్యవస్థలో భాగమైన ఆర్టీసీలో ప్రయాణికులను చేరవేయడం సామాజిక భాద్యతగా స్వీకరించామని వివరించారు.
ఆర్టీసీ ఉన్నతి కోసం వీసీ సజ్జన్నార్ పలు కీలక చర్యలకు శ్రీకారం చుట్టారు. టీఎస్సార్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం అంటూ మొదలెట్టిన ఆయన.. ఆ తర్వాత సంస్థ బస్సుల్లో పలు సౌకర్యాలు, బస్టాండ్లలో కీలక వసతులు ఏర్పాటు చేస్తూ సాగుతున్నారు. అందులో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి గురువారం బంపరాఫర్ ప్రకటించారు.
బస్సుల్లో ప్రయాణించిన సందర్భంగా మీకు ఎదురైన అనుభవాలను చెప్పాలని పిలుపునిచ్చారు. అలాంటి వారికి రివార్డులు ఇస్తామంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ ప్రకారం.. టీఎస్సార్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసిన వారు పంపే అనుభవాల్లో నుంచి గుండెలకు హత్తుకునేలా ఉన్న అనుభవాలు పంపిన వారికి టీఎస్సార్టీసీ తరఫున రివార్డులు ప్రకటిస్తారు. సో మీరు ట్రై చేయండి.
మరోవైపు ఏ సమస్య అయినా సరే ఇట్టే పరిష్కరిచ్చేస్తున్నారు సజ్జనార్. ఇష్యూను ట్విట్టర్లో లేవనెత్తితే చాలు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. ఈ సారి ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతామని చెప్పారు. దీంతో ఆక్యుపెన్సీ మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఇటీవల కొన్ని పరిణామాలు మింగుడు పడటం లేదు. కోడికి టికెట్ కొట్టడం, చిరు వ్యాపారిని బొప్పాయి పండు ఇవ్వాలని డ్రైవర్ కోరడం.. ఆర్టీసీ ప్రతిష్టను కాస్త మసక బారిస్తున్నాయి.