కామెన్మెన్గా సజ్జనార్.. ఆర్టీసీ బస్సులో ప్రయాణం, ఎంజీబీఎస్లో తిరుగుతూ..
పవర్ పుల్ కాప్.. సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. తనకు అప్పగించిన ఏ పని అయినా నిక్కచ్చిగా చేస్తారు. ఇప్పుడు సాధారణ వ్యక్తిగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రయాణికుల సమస్యలు తెలుసుకున్నారు. ఇవాళ ఎంజీబీఎస్ లో ఆకస్మిక తనిఖీ చేశారు. ఉదయం జీడిమెట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో లకిడకపూల్ బస్ స్టాప్ లో బస్సు ఎక్కి కండక్టర్కు తానెవరో చెప్పకుండా టికెట్ తీసుకుని ఎంజీబీఎస్ వరకు ప్రయాణించారు. బస్సులో ఎక్కిన తరువాత ప్రయాణీకులతో మాటలు కలిపి ప్రయాణికుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

కామన్ మెన్
ఎంజీబీఎస్లో సాధారణ వ్యక్తిగా కలియ తిరుగుతూ బస్టాండ్ ప్రాంగణంలో పరిశుభ్రతను, ఏ ఏ ప్లాట్ ఫామ్లలో ఏ ఏ రూట్ బస్సులు వెళ్తున్నాయో తెలియజేసే సెక్టార్ వైస్ రూట్ బోర్డు, విచారణ కేంద్రం రిజర్వేషన్ కేంద్రాల పనితీరును పరిశీలించారు. ఫ్లాట్ ఫామ్పై నిలబడి ఉన్న బస్సు సిబ్బందితో మాట్లాడి ఆదాయ వివరాలు అడిగారు. బస్సులోని ప్రయాణికులతో రవాణా సేవలు తీరును అడిగి తెలుసుకున్నారు.
సూచనలు
మరుగుదొడ్ల పరిశుభ్రత మెరుగుపరచాలని పార్కింగ్ స్థలంలో పేరుకుపోయిన వాహనాలను స్క్రాప్ యార్డుకు తరలించాలని సూచించారు. ప్రకటనల ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవడానికి పార్కింగ్ నిర్వహణ బాధ్యతను అవుట్ సోర్సింగ్ ఎజెంట్స్కి అప్పగించవలసిందిగా సూచించారు. ఖాళీగా ఉన్న స్టాల్స్ ని భర్తీ చేసి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలి అన్నారు. టికెటేయేతర ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగా పండుగలు వివాహ సమయాలలో బస్సులను అద్దె ప్రాతిపదికన ఇవ్వాలని అధికారులకు సూచించారు. దసరా పండగ రద్దీకి తగిన బస్సులు నడిపి సంస్థ ఆదాయాన్ని పెంపొందించాలని రిజర్వేషన్ ఏర్పాటు చేసి తగిన ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు
రంగంలోకి సజ్జనార్
మరోవైపు సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై హత్యాచారం కేసులో నిందితుడి కోసం తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రంగంలోకి దిగారు. నిందితుడిని గుర్తించేందుకు ఆర్టీసీ బస్సుల్లో అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ ఆర్టీసీ సిబ్బందికి సూచించారు. నిందితుడిని గుర్తిస్తే వెంటనే 9390616366, 9490616627 నెంబర్లకు కాల్ చేయాలన్నారు. దాంతో ఆర్టీసీ ఉద్యోగులు అప్రమత్తమయ్యారు. నిందితుడు మద్యం మత్తుల్లో బస్టాండ్లలో నిద్రపోయే అవకాశం ఉందని తెలిపారు.
అలర్ట్
ఇలాంటి కేసులను చేధించడంలో ఐపీఎస్ సజ్జనార్కు మంచి గుర్తింపు ఉంది. అయితే ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన నిందితుడిని గాలించేందుకు తెలంగాణ ఆర్టీసీని అలర్ట్ చేశారు. బస్ స్టేషన్లు, బస్సుల్లో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఆర్టీసీ బస్సుల్లోనే నిందితుడు ప్రయాణించే అవకాశం ఉందని, ప్రతి బస్సులో, బస్లాండ్లలో నిందితుడి ఫొటోను పెట్టాలని ఆదేశించారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లతో పాటు సిబ్బంది అంతా అలర్ట్ గా ఉండాలని సూచించారు. నిందితుడు రాజు కదలికలు ఉన్నట్టుగా ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ఇదీ నేపథ్యం
సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల పాపపై ఆటో డ్రైవర్ రాజు హత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై కిరాతకంగా చంపేశాడు. పసిపాపను దారుణంగా హత్యచేసిన నిందితుడిని గుర్తించి అప్పగించేంతవరకు పాప మృతదేహాన్ని కదిలించేది లేదంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి కాలనీలో అదృశ్యమైన బాలిక ఆచూకీ కోసం తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు. పాప ఆచూకీ తెలియకపోవడంతో ఆటో రాజుపై అనుమానం వచ్చింది. ఆటో డ్రైవర్గా పని చేస్తున్న రాజు చిల్లర దొంగతనాలు చేస్తుండేవాడు. జనాలతో దురుసుగా ప్రవర్తించేవాడు. అతడే పాపను ఏమైనా చేశాడమేననే అనుమానంతో అర్థరాత్రి అతడి ఇంటి తలుపులు పగలగొట్టి చూశారు. వారి అనుమానమే నిజమైంది.. చిన్నారి ప్రాణాలు కోల్పోయి విగతజీవిలా పడి ఉంది. ఆడుకుంటూ కేరింతలు కొట్టిన చిన్నారి చనిపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. తమ పాపను దారుణంగా హత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. రోజులు గడుస్తున్నా నిందితుడి గురించి ఎలాంటి క్లూస్ కూడా దొరకలేదు. దాంతో నిందితుడిని గుర్తించి సమాచారం అందిస్తే.. వారికి 10లక్షల రివార్డు ఇస్తామంటూ రాజు ఫోటోను పోలీసులు విడుదల చేశారు.












Click it and Unblock the Notifications