గుడ్న్యూస్: 15వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు..
రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతుబంధు డబ్బులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించిన నిధుల పంపిణీ అంశంపై అధికారులు దృష్టిసారించారు. రైతుబంధు లబ్దిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం రూ. 7 వేల 500 కోట్ల నిధులను సర్దుబాటు చేసేందుకు ఆర్థికశాఖ అధికారులు కసరత్తు చేశారు.
డిసెంబర్ 15 నుంచే రైతుల ఖాతాల్లో నిధులు జమ కావాలని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. దీంతో అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎకరాకు రూ. 5 వేల చొప్పున కోటిన్నర లక్షల ఎకరాలకు రూ.7,500 కోట్లు అవసరం అవుతాయి. గత వానాకాలం సీజన్లో మొదటి రోజు ఒక ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు, రెండో రోజు రెండెకరాలు, మూడో రోజు మూడెకరాలున్న వారికి రైతుబంధు నగదును ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఈ సారి కూడా అదే పద్ధతిలో పంపిణీ చేయాలని అధికారులు భావిస్తున్నారు.
గత వానాకాలం సీజన్కు సంబంధించి జూన్లో 60.84 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయంగా రూ.7,360.41 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.47 కోటి ఎకరాలకు నిధుల పంపిణీ జరిగింది. ఈ యాసంగి సీజన్ లో నిధుల పంపిణీ మరింత పెరిగే అవకాశం ఉంది. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతుల సంఖ్య, అందుకు అనుగుణంగా భూ విస్తీర్ణం పెరిగితే బడ్జెట్ కూడా పెరగనుంది.
రూ.7,500 కోట్లు అవసరం అని వ్యవసాయ, ఆర్థిక శాఖలు అంచనా వేశాయి. యాసంగిలో రైతులు వరికి ప్రత్యామ్నాయంగా వేరే పంటలు వేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయినప్పటికీ రైతులకు ఎప్పటిలాగే రైతుబంధు డబ్బులు అందిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఏటా వానాకాలం, యాసంగికి పెట్టుబడి సాయంగా ప్రభుత్వం రైతు బంధు అందజేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందుకోసం భారీగా నగదును వెచ్చిస్తోంది. తెలంగాణ ప్రభుత్వాన్ని చూసి.. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది.