‘కరోనా’పై అసత్య ప్రచారాలు వద్దంటూ వార్నింగ్: ప్రత్యేక హెల్ప్లైన్,కాల్ సెంటర్ ఏర్పాటు, ఆస్పత్రి కూడా
హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్(కొవిడ్ 19)పై అసత్య ప్రచారాలు చేయొద్దని తెలంగాణ మంత్రులు కోరారు. రాష్ట్రంలో కరోనా వైరస్ గుర్తించిన నేపథ్యంలో మంత్రులు ఈటెల రాజేందర్, కే తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన ఈ సమావేశానికిప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య, ఆరోగ్య శాఖ తోపాటు వివిధ శాఖలకు అధిపతులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

హెల్ప్ లైన్, కాల్ సెంటర్ ఏర్పాటు..
సరైన వ్యాధి లక్షణాలు ఉన్న వారి సహాయార్థం ప్రత్యేక హెల్ప్ లైన్(040 24651119) ఏర్పాటు చేయాలని మంత్రులు ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. 24 గంటల పాటు నడిచే కాల్ సెంటర్ ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న కాల్ సెంటర్ సామర్థ్యాన్ని మరింతగా పెంచాలన్నారు.

ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..
గతంలో వచ్చిన ఇతర వైరస్లతో పోల్చితే కరోనా వైరస్లో మరణాల రేటు అతి తక్కువగా ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు, ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు. ‘కరోనా వస్తే చనిపోతారు' అన్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని మంత్రులు స్పష్టం చేశారు. కాబట్టి ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు.

గాంధీ ఆస్పత్రిలో చికిత్స..
ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో కరోనా మెడికేషన్కు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాలో విస్తృతంగా వైరస్కి సంబంధించి ప్రజలను చైతన్యం చేసే పాజిటివ్ ప్రచారం నిర్వహించాలన్నారు. ఇందుకోసం సమాచార,ప్రచార శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు.

కరోనాపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు
తెలుగు ,ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ప్రజలకు కరోనా వైరస్పైన అవగాహన కల్పించే సమాచారం అందించాలని మంత్రులు ఆదేశించారు. హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలోని పురపాలక పట్టణాల్లో పెద్ద ఎత్తున హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని మంత్రుల సూచించారు. కరోనా వైరస్ సమస్యని ఉపయోగించుకొని ఎవరైనా దుష్ప్రచారం చేస్తూ వ్యాపార ప్రయోజనాలకు వాడుకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. కరోన వైరస్ పైన అసత్యాలను ప్రచారం చేసే వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రులు హెచ్చరించారు.
Recommended Video


కరోనాకు ప్రత్యేక ఆస్పత్రి...
కరోనా చికిత్స కోసం ప్రత్యేక ఆస్పత్రి ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోకి ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు, నర్సులను సరిపోయేంత మందిని తీసుకుంటున్నామని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులను కూడా అప్రమత్తం చేశామన్నారు. కరోనా అనుమానితులను ప్రభుత్వ ఆస్పత్రులకు పంపాలని కోరినట్లు తెలిపారు. 9 ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రతి శాఖకు ఒక నోడల్ అధికారి ఉంటారన్నారు. హైదరాబాద్లో ఒకరికి కరోనావైరస్ సోకినట్లు నిర్ధారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు కరోనావైరస్ సోకిందనే అనుమానున్నవారు కూడా ఆస్పత్రుల్లో చేరి చికిత్స తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications