హైకోర్టు మెట్లెక్కిన తీన్మార్ మల్లన్న: వేధింపులపై పిటిషన్, సోమవారం విచారణ
తీన్మార్ మల్లన్న హైకోర్టును ఆశ్రయించాడు. తనపై కేసుల నమోదు వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. ఈ నెల 3న తనకు నోటీసులు ఇచ్చారని, రెండ్రోజుల సమయంలోనే విచారణకు పిలిచారని వాపోయారు. హైదరాబాద్లోని మారుతీ జ్యోతిష్యాలయం నిర్వాహకుడు లక్ష్మీకాంతశర్మను డబ్బులు డిమాండ్ చేశాడనే ఫిర్యాదుపై తీన్మార్ మల్లన్నపై కేసు నమోదైంది. తీన్మార్ మల్లన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై సీసీఎస్, చిలకలగూడ పీఎస్లో కేసులు నమోదయ్యాయని, దర్యాప్తు పేరుతో పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఆన్ లైన్ లో విచారణ జరిపేలా ఆదేశించాలని తన పిటిషన్ లో కోరారు. పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
తీన్మార్ మల్లన్న తన ప్రైవసీకి భంగం కలిగించాడంటూ మహిళా జర్నలిస్ట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. క్యూ న్యూస్ మాజీ బ్యూరో చీఫ్ ప్రవీణ్తో కలసి ఉన్న ఫొటోలను చూపుతూ అభ్యంతరకరంగా వార్తలు ప్రసారం చేశారని.. తన గౌరవ మర్యాదలకు భంగం కలిగించారంటూ ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. యువతి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు క్యూ న్యూస్ ఆఫీస్లో సోదాలు చేశారు. కొన్ని హార్డ్ డిస్క్లను సీజ్ చేసి తీసుకెళ్లారు. క్యూ న్యూస్ ఆఫీస్కి పోలీసులు రావడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.
తీన్మార్ మల్లన్నపై స్వామీజీ లక్ష్మీకాంతశర్మ చిలకలగూడ పీఎస్లో ఫిర్యాదు చేశారు. లక్ష్మీకాంత శర్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు రెండు రోజుల కిందట పోలీస్ స్టేషన్కి పిలిపించి సుమారు 5 గంటల పాటు విచారించారు. తన తరఫు న్యాయవాదులతో విచారణకు హాజరైన తీన్మార్ మల్లన్న.. పోలీసులు నోటిసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మరోమారు విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారని ఆయన తెలిపారు. పలు కేసుల విషయమై తరచూ విచారణ పేరుతో పోలీస్ స్టేషన్కి పిలిపించడంపై మల్లన్న కోర్టుని ఆశ్రయించారు. మల్లన్న పిటిషన్పై కోర్టు సోమవారం విచారణ జరపనుంది.
అతకుముందు క్యూ న్యూస్ బ్యూరో చీఫ్ చిలుక ప్రవీన్ హాట్ కామెంట్స్ చేశారు. తీన్మార్ మల్లన్న ఓ సైకో. క్యూ న్యూస్ చానల్ పేరుతో అక్రమ దందాలకు పాల్పడుతున్న బడాచోర్. ఒకవైపు అంబేద్కర్, కాన్షీరాం సిద్ధాంతాలను వల్లె వేస్తూ ఎస్సీలు, బీసీలు, మైనార్టీలను మోసం చేస్తున్నాడని ఫైరయ్యారు. రాజకీయ ప్రముఖుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ కోట్లకు పడగలెత్తాడని మండిపడ్డారు. ఆఖరికి సామాజిక సేవ పేరుతో కూడా సొమ్ము కూడబెడుతున్నడు' అని క్యూ న్యూస్ చానల్ బ్యూరో చీఫ్, సోషల్ మీడియా కన్వీనర్ చిలుక ప్రవీణ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇదేమని నిలదీస్తే వేధింపులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై దాడులు జరిగినా వెనకడుగు వేసేది లేదని, మల్లన్న చేస్తున్న అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతానని వెల్లడించారు.

బహుజనవాదం, అంబ్కేదర్, కాన్షీరాం సిద్ధాంతాలను చెప్తూ ఎస్సీలు, బీసీలు, మైనార్టీలను వంచిస్తున్నాడని ప్రవీణ్ మండిపడ్డారు. బంధువులు, మున్నూరుకాపులకే మల్లన్న ప్రాధాన్యతనిస్తాడని, అందుకు క్యూ న్యూస్ చానలే నిదర్శనమని ఉదహరించారు. చానల్లో కిందిస్థాయి ఉద్యోగుల నుంచి ఎడిటర్ వరకూ ఉన్న 16 మందిలో 12 మంది వాళ్లేనని వెల్లడించారు. సాయం కోసం ఆశ్రయించిన మహిళలను సైతం అసభ్యకర పదజాలంతో కించపరుస్తాడని, మల్లన్న వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించిందని వివరించారు. మల్లన్న సమాజానికి పట్టిన చీడపురుగని, పార్టీ పెడతానని, ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని తనను నమ్మించాడని ప్రవీణ్ తెలిపారు. మల్లన్న అక్రమాలను చూడలేకే చానల్ నుంచి బయటకొచ్చానని, ఇంకెవరూ మోసపోవద్దనే ఈ విషయాలను బయటపెడుతున్నానని పేర్కొన్నారు.
క్యూన్యూస్ చానల్లో ఉదయం ఒక దందాను, సాయంత్రం ఒక దందాను నిర్వహిస్తూ, మల్లన్న చేస్తున్న అక్రమాలకు అంతే లేదని ప్రవీణ్ ఆరోపించారు. అనేకమంది రాజకీయ ప్రముఖుల నుంచి వసూళ్లకు తెరలేపాడని వివరించారు. రూ.200కోట్లకు పైగా ఆస్తులను మూటగట్టుకున్నాడని వెల్లడించారు. బండి సంజయ్, ఎంపీ అర్వింద్, ఈటల రాజేందర్తో సహా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు దగ్గర 15 రోజుల క్రితం డబ్బులు తెచ్చుకున్నాడని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కను సైతం బోల్తా కొట్టించాలని యత్నించాడని తెలిపారు. పక్క రాష్ర్టానికి చెందిన ఓ మాజీమంత్రితో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాడని ఆరోపించారు.
సొసైటీ పేరుతో సామాజిక సేవా సంస్థను ఏర్పాటుచేసి అనేక అక్రమాలకు తీన్మార్ మల్లన్న తెగబడుతున్నాడని ప్రవీణ్ వెల్లడించారు. రూ.50 కోట్లు కొల్లగొట్టేందుకు భారీవ్యూహాన్ని రచించాడని మండిపడ్డారు. తనను కేసుల్లో ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నాడని ప్రవీణ్ వాపోయారు. అవినీతికి పాల్పడుతూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన ఉద్యోగి దాసరి భూమయ్యను ఎందుకు వెనకేస్తున్నావో చెప్పాలని మల్లన్నను ప్రవీణ్ డిమాండ్ చానల్ను అడ్డుపెట్టుకుని తీన్మార్ మల్లన్న అమాయకుల జీవితాలతో ఆడుకున్నట్టు ప్రవీణ్ వీడియో విడుదల చేశారు.
హైదరాబాద్లోని సీతాఫల్మండికి చెందిన మంజుల అనే మహిళకు రూ.2 కోట్ల విలువ చేసే ఇల్లు కబ్జాకు గురైంది. ఆమె కోర్టును ఆశ్రయించగా 23 ఏండ్లుగా కేసు విచారణ కొనసాగుతున్నది. కబ్జా చేసినవాళ్లు ఆ వ్యవహారాన్ని సెటిల్ చేయాలని తీన్మార్ మల్లన్నను ఆశ్రయించారు. వారితో ఒప్పందం కుదుర్చుకుని రంగంలోకి దిగిన మల్లన్న నేరుగా మంజులకు ఫోన్ చేసి సెటిల్ చేస్తానని నమ్మబలికి తన ఆఫీసుకు పిలిపించుకున్నాడు. తీరా అక్కడికి వెళ్లాక కబ్జాదారుల తరపున వకాల్తా పుచ్చుకుని బాధిత మహిళను బెదిరించాడు. అయినా ఆమె ఒప్పుకోకపోవటంతో కబ్జాదారుల నుంచి రూ.20లక్షల ఇప్పిస్తానని నమ్మించి మంజులతో కాగితాలు, ఆస్తిని వారి పేరిట రాయించాడు. ఇప్పటి వరకు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు అని బాధిత మహిళ చెప్పినట్టు వీడియోలో ఉంది.












Click it and Unblock the Notifications