శభాష్ కేటీఆర్.. కరోనాలోనూ సాధించావ్.. ఐటీ ఎగుమతుల్లో 18శాతం వృద్ధి.. సీఎం కేసీఆర్ దిల్ ఖుష్
కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోతున్న తరుణంలో తెలంగాణ ఐటీ శాఖ అరుదైన ఘనత సాధించింది. ఐటీ, ఐటీ ఆధారిత ఎగుమతుల్లో మరోసారి సత్తా చాటుకుంది. వరుసగా ఐదోసారి దేశంలోనే ఫస్ట్ ర్యాంకులో నిలిచింది. ఈ ఏడాదికి గాను ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ 17.93 శాతం వృద్ధి రేటు సాధించింది. ఈ మేరకు ఐటీ వార్షిక నివేదికను ఆ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్కు గురువారం సమర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ పలు కీలక అంశాలు వెల్లడించారు..

జాతీయ సగటు కంటే రెట్టింపు..
ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ మరోసారి టాప్ ప్లేసులో నిలవడం ఆనందంగా ఉందన్న మంత్రి కేటీఆర్ దానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికిగానూ రాష్ట్రం నుంచి ఐటీ/ఐటీ ఆధారిత ఎగుమతుల్లో 17.93 శాతం వృద్ధి సాధించామని, ఐటీ ఎగుమతుల్లో జాతీయ సగటు 8.09కాగా, దానికి రెండింతలు ఎక్కువగా తెలంగాణ వృద్ధి రేటు ఉండటం గమనార్హమని మంత్రి చెప్పారు. ఈ ఘనత సాధించినందుకుగానూ మంత్రికి అభినందనలు వెల్లువెత్తాయి.

పెరిగిన ఉద్యోగ అవకాశాలు..
తెలంగాణ నుంచి ఈ ఏడాది ఎగుమతైన ఐటీ సేవల విలువ రూ1.29 లక్షల కోట్లుగా ఉందని కేటీఆర్ వెల్లడించారు. గతేడాది 1.09లక్షల కోట్ల ఉత్పత్తుల్ని ఎగుమతి చేయగా, ఈ ఏడాది 17.93 వృద్ధిరేటు సాధించామన్నారు. అదేసమయంలో రాష్ట్ర ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు బాగా మెరుగుపడ్డాయని, 2019-20 ఏడాదిలో ఐటీ ఎంప్లాయిమెంట్ వృద్ధి రేటు 7.2 శాతంగా నమోదైందని, తద్వారా ఉద్యోగుల సంఖ్య 5లక్షల 82వేల 126కు పెరిగిందన్నారు.

టైర్-2 సిటీలకూ ఐటీ..
రాష్ట్రంలో ఐటీ రంగాన్ని విస్తరించేందుకు అవసరమైన అన్ని చర్యలనూ పకడ్బందీగా చేపట్టామన్న కేటీఆర్.. 2019-20 ఏడాదిలోనూ ప్రముఖ కంపెనీలెన్నో హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. అమెజాన్ సంస్థ ప్రపంచంలోనే అతి పెద్ద ఆఫీసును హైదరాబాద్ లో ఏర్పాటుచేసిందని, మిక్రాన్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ అండ్ డీ సెంటర్ ను ఇక్కడే నెలకొల్పిందని గుర్తుచేశారు. వరంగల్ లాంటి టైర్-2 సిటీలకు కూడా ఐటీని విస్తరింపజేస్తున్నామన్న మంత్రి.. మడికొండలోని ఐటీ పార్క్లో సైయెంట్, టెక్ మహీంద్రా క్యాంపస్లు ఏర్పాటుచేశామన్నారు.
Recommended Video

కేసీఆర్ దిల్ ఖుష్..
కొడుకు కేటీఆర్ ఆధ్వర్యంలోని ఐటీ శాఖ ఘనంగా వృద్ధి సాధించడంతో సీఎం కేసీఆర్ ఉప్పొంగిపోయారు. కరోనా కష్టకాలంలోనూ ఐటీ పరిశ్రమను సజావుగా నడిపించావంటూ మంత్రి కేటీఆర్ కు కితాబిచ్చారు. ఐటీ శాఖలోని అందరినీ సీఎం అభినందించారు. భవిష్యత్లోనూ ఇదే పట్టుదలతో ముందుకెళ్లాలని సూచించారు. ఐటీ ఎగుమతుల వృద్ధి రేటుతో భవిష్యత్తులోనూ ఐటీ పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణే అని మరోసారి నిరూపితం అయిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications