ఈ నెల 17 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ ఎన్నికల తర్వాత అధికారంలోకి రెండో సారి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్టకేలకు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు అధికార ప్రకటన విడుదల చేసింది. ముందుగా ఈ నెల 16న ప్రొటెం స్పీకర్ను ఎన్నుకుని అదే రోజున ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. అయితే ప్రొటెం స్పీకర్గా శాసన సభ సభ్యుల్లో సీనియర్ అయిన మజ్లిస్ పార్టీ అభ్యర్థి చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ చేత 16వ తేదీన రాజ్భవన్లో ప్రొటెం స్పీకర్గా గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ మరుసటి రోజు అంటే 17వ తేదీన నూతన శాసనసభ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి.

అంతకుముందు అంటే జనవరి 17న ఉదయం 11:30 గంటలకు ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశం అవుతుంది. ప్రజలు గొప్ప విజయాన్ని టీఆర్ఎస్ పార్టీకి అందించారని ఆ స్ఫూర్తితో మంచిరోజున శాసన సభ సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సీఎం కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. శాసనసభ కార్యకలాపాలు జనవరి 17 నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయి. ముందుగా ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం అదే రోజున స్పీకర్ ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ ప్రకటన, నామినేషన్ కార్యక్రమాలు ఉంటాయి.
జనవరి 18వ తేదీ రోజున స్పీకర్ ఎన్నిక, స్పీకర్ ఎన్నికైనట్లు ప్రకటన చేస్తారు. అనంతరం కొత్తగా ఎన్నికైన స్పీకరును సీఎం కేసీఆర్, ప్రతిపక్షనేత స్పీకర్ స్థానంలో స్పీకరును కూర్చోబెడతారు. ఆ తర్వాత ఆయన అధ్యక్షతన సభాకార్యక్రమాలు జరుగుతాయి. అనంతరం స్పీకర్ బీఎసీ సమావేశాన్ని నిర్వహిస్తారు. జనవరి 19న గవర్నర్ నరసింహన్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జనవరి 20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదం తెలపడంతో తొలి అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి.












Click it and Unblock the Notifications