జగన్ బాటలో కేసీఆర్: రూ.4వేల కోట్లతో సరికొత్త విద్యా పథకం -హరీశ్ పద్దులో కొత్త స్కీములు, ప్రత్యేకతలివే
ఆర్థిక మంత్రి హరీశ్ రావు గురువారం ప్రవేశపెట్టిన తెలంగాణ వార్షిక బడ్జెట్ 2021-2022లో పలు కొత్త పథకాలను ప్రకటించారు. దళితుల అభ్యున్నతి కోసం నూతనంగా రూ.వెయ్యి కోట్ల నిధులతో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్, తొలిసారిగా రాష్ర్ట ప్రభుత్వ బడ్జెట్ నుంచి మండల, జిల్లా పరిషత్లకు రూ. 500 కోట్ల నిధుల కేటాయింపుతోపాటు విద్యారంగానికి సంబంధించీ మరో కొత్త పథకం ప్రవేశపెట్టారు.

ఏపీ ‘నాడు-నేడు’ తరహాలో..
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వం 'నాడు -నేడు' పేరుతో అన్ని స్కూళ్లలో మౌలిక సదుపాయాలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయడం తెలిసిందే. ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కారు పరిమిత స్థాయిలో చేసిన పనిని జగన్ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తగా, ఇప్పుడు కేసీఆర్ సర్కారు సైతం దాదాపు అదే బాటలో బడులను ఇంకా బాగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి.. తెలంగాణలో విద్యారంగానికి సంబంధించి రూ.4వేల కోట్లతో సరికొత్త పథకాన్ని మంత్రి హరీశ్ రావు బడ్జెట్ లో ప్రకటించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ మౌలిక వసతుల ఏర్పాటు చేయడమే ఈ పథకం ఉద్దేశమని, బృహత్తర విద్యా పథకం కోసం ఈ ఏడాది రూ.2వేల కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. మొత్తంగా పాఠశాల విద్య కోసం రూ. 11,735 కోట్లు కేటాయించగా, ఉన్నత విద్య కోసం రూ.1,873 కోట్లు కేటాయించారు. అలాగే,

దళితుల కోసం కొత్త పథకం
విద్యా పథకంతోపాటు ఈసారి కొత్తగా 'సీఎం దళిత్ ఎంవపర్ ప్రోగ్రామ్' అనే పథకాన్ని కూడా బడ్జెట్ లో ప్రకటించారు. ఈ కొత్త పథకానికి తొలి సారే రూ. 1000 కోట్లు కేటాయించారు. ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ. 21,306.85 కోట్లు, ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ. 12,304. 23 కోట్లు కేటాయించారు. బీసీ కులాలకు సంబంధించి.. నేతన్నల సంక్షమం కోసం రూ. 338 కోట్లు, బీసీ కార్పొరేషన్, అత్యంత వెనుకబడిన తరగతుల కార్పొరేషన్కు రూ. 1000 కోట్లు, మొత్తంగా బీసీ సంక్షేమ శాఖకు రూ. 5,522 కోట్లు ఇచ్చారు. కాగా,

హైదరాబాద్ నగరానికి పెద్ద పీట
కేటాయింపుల పరంగా హైదరాబాద్ నగరానికి ఈసారి కూడా పెద్దపీట వేశారు. హైదరాబాద్ మహానగరంలో ఉచిత మంచినీటి సరఫరా కోసం రూ. 250 కోట్లు, సిటీ అవసరాల కోసం సుంకిశాల వద్ద నిర్మించే తాగునీటి ప్రాజెక్టు కోసం రూ. 725 కోట్లు, మూసీ నది పునరుజ్జీవం కోసం, సుందరీకరణ కోసం రూ. 200 కోట్లు, ఓఆర్ఆర్ పరిధి లోపల కొత్తగా ఏర్పడిన కాలనీల తాగునీటి సరఫరా కోసం రూ. 250 కోట్లు కేటాయించారు. త్వరలో ఎన్నికలు జరుగనున్న వరంగల్ కార్పొరేషన్కు రూ. 250 కోట్లు, ఖమ్మం కార్పొరేషన్కు రూ. 150 కోట్లు కేటాయించారు. మొత్తంగా ఈ బడ్జెట్లో పురపాలక, పట్టణాభివృద్ధికి రూ. 15,030 కోట్లు ఇచ్చారు.

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు తలా 5కోట్లు
కరోనా కారణంగా కేంద్రంలోని మోదీ సర్కార్ ఎంపీ ల్యాండ్స్ నిధులను నిలిపేయగా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇచ్చే నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం రూ. 5 కోట్లు(ఒక్కొక్కరికి) ప్రకటించారు. తొలిసారిగా రాష్ర్ట ప్రభుత్వ బడ్జెట్ నుంచి మండల, జిల్లా పరిషత్లకు రూ. 500 కోట్ల నిధులు ప్రకటించారు. పల్లెప్రగతి కింద ఇప్పటి వరకు గ్రామపంచాయతీలకు రూ. 5,761 కోట్ల నిధులు విడుదల చేశామని, ఇందులో జిల్లా పరిషత్లకు రూ. 252 కోట్లు, మండల పరిషత్లకు రూ. 248 కోట్లు ఇస్తామని మంత్రి హరీశ్ తెలిపారు. మొత్తంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 29,271 కోట్లు కేటాయించారు.












Click it and Unblock the Notifications