ఎన్నికల వేళ కొత్త వరాలు - కీలక నిర్ణయాలు: నేడే ప్రభుత్వ ప్రకటన..!?
ఎన్నికల వేళ కొత్త నిర్ణయాలతో భారీ కేటాయింపులతో తెలంగాణ బడ్జెట్ సభ ముందుకు రానుంది.
మరో కొద్ది నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించాలని సీఎం కేసీఆర్ లక్ష్యం. అన్ని వర్గాలకు ఆకట్టుకుంటూ..అన్ని హామీలను నెరవేరుస్తూనే ఎన్నికల బడ్జెట్ కు ప్రభుత్వం సిద్దమైంది. రూ మూడు లక్షల కోట్లకు పైగా అంచనాలతో 2023-24 వార్షిక బడ్జెట్ ఈ రోజు సభ ముందుకు రానుంది. బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ ఉదయం శాసనసభ లో మంత్రి హరీష్ రావు.. మండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ప్రతీ నియోజకవర్గంలో మూడు వేల ఇళ్లు.. రైతు రుణ మాఫీ నిధుల ప్రకటనకు సిద్దమైనట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో కొత్త పథకాలు ప్రకటిస్తారా.. పేదలకు వరాలిస్తారా..కేంద్రం నుంచి ఏ మేర నిధులు అంచనా వేస్తున్నారు.. సొంత రాబడి ఎలా పెంచుకుంటారు..ఇలాంటి కీలక అంశాలకు నేటి బడ్జెట్ ద్వారా ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది.

భారీ బడ్జెట్ కు సర్వం సిద్దం..
బీఆర్ఎస్ ప్రభుత్వం 2023-24 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనకు సర్వం సిద్దమైంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.2,56,958.51 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆ ప్రతిపాదనలకు మరో 10-15 శాతం మేర పెంచుతూ ప్రధాన శాఖలు ఆర్దిక శాఖకు ప్రతిపాదనలు అందించాయి. వీటన్నింటినీ క్రోడీకరించి ఆర్దిక శాఖ రూ 3 లక్షల కోట్లకు పైగా అంచనాలతో బడ్జెట్ ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల ఏడాది కావటంతో సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ.. ప్రతిష్ఠాత్మక పథకాలను నిధులను పెంచుతూ బడ్జెట్ లో కేటాయింపులు చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర గ్రాంట్లు, పన్నుల్లో వాటా, రానున్న ఎన్నికలు, కొత్త పథకాలు, పాత పథకాలకు కేటాయింపులు, వాస్తవ రాబడులు, వ్యయాలు వంటి కీలక అంశాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రప్రభుత్వం బడ్జెట్ను రూపొందించినట్లు సమాచారం.

ప్రతిష్ఠాత్మక పథకాలకు కేటాయింపు పైనే..
ఎన్నికల సమయంలో ప్రవేశ పెడుతున్న బడ్జెట్ కావటంతో ప్రభుత్వం సంక్షేమం.. పేదరిక నిర్మూలన..అభివృద్ధికి బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. దళిత బంధు, రైతు బంధు, డబుల్ బెడ్ రూముల ఇళ్ల పథకాల పెద్ద మొత్తంలో నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. రానున్న ఆర్దిక సంవత్సరానికి సంబంధించి పన్నుల ఆదాయం.. గ్రాంట్ ఇన్ ఏయిడ్ ఎంత మేర ప్రతిపాదిస్తారనేది ఈ సారి బడ్జెట్ లో కీలకం కానుంది. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు పూర్తి స్థాయిలో రాకపోవడం, అప్పులపై ఆంక్షలు కొనసాగుతుండడంతో ప్రభుత్వం ఆశించిన మేర వ్యయం చేయలేకపోతోంది. ఈనేపథ్యంలో ప్రభుత్వం ఈసారి వాస్తవాల ఆధారంగా బడ్జెట్ పెడుతుందా అన్న చర్చ విస్తృతంగా జరిగింది. కానీ, ఎన్నికల సంవత్సరం కావడంతో భారీ బడ్జెట్వైపే ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు సమాచారం.

రుణ మాఫీ..ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత
2018 ఎన్నికల సందర్భంగా రూ.లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా కొంత మేర మాఫీ చేస్తూ వస్తోంది. మొదట రూ.25 వేల లోపు రుణాలను మాఫీ చేసింది. ఆ తర్వాత రూ.50 వేల లోపు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించినా... రూ.37 వేల లోపు వరకే రుణాలు మాఫీ అయ్యాయి. కొత్త బడ్జెట్(2023-24)లో రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించి, అందుకు అనుగుణంగా కేటాయింపులు చేయనున్నట్లు తెలిసింది. ప్రతీ నియోజకవర్గానికి మూడు వేళ ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ప్రతిపాదనలు చేసే అవకాశం కనిపిస్తోంది. గిరిజన బంధు గురించి ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అందరూ అసెంబ్లీకి హాజరు కావాలని సీఎం కేసీఆర్ క్యాబినెట్ భేటీలో మంత్రులకు సూచించారు. దళిత బంధుకు రూ.17 వేల కోట్లు, రైతుబంధు పథకానికి రూ.14 వేల కోట్లను ప్రకటిస్తుందని సమాచారం. రాజకీయంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రతిపాదించే బడ్జెట్ పైన ఆసక్తి కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications