తెలంగాణ మంత్రివర్గ సమావేశం- కీలక నిర్ణయాలు?
తెలంగాణ మంత్రివర్గం గురువారం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి అధ్యక్షత వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో ఈ భేటీ ఏర్పాటు కానుంది.
హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గం గురువారం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి అధ్యక్షత వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో ఈ భేటీ ఏర్పాటు కానుంది. ఈ భేటీలో- రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు చర్చకు రానున్నాయి. శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మంత్రివర్గం సమావేశం కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
గత ఏడాది డిసెంబర్ 10వ తేదీ తరువాత మళ్లీ తెలంగాణ మంత్రివర్గం భేటీ కాబోతోండటం ఇదే తొలిసారి. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు, పింఛన్ మొత్తం పెంపు, కొత్త పే రివిజన్ కమిషన్ ఏర్పాటు, కొన్ని సంక్షేమ పథకాలపై ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్నందున వాటిని దృష్టిలో ఉంచుకుని కొత్త పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలుపుతుందని తెలుస్తోంది.

భారత్ రాష్ట్ర సమితి కార్యకలాపాలను ఇతర రాష్ట్రాలకు విస్తరించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపైనా ముఖ్యమంత్రి కేసీఆర్- తన సహచర మంత్రులతో చర్చిస్తారని తెలుస్తోంది. పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం, ఇళ్ల నిర్మాణానికి ప్లాట్ల కేటాయింపు, దళిత బంధు పథకం కింద లబ్ధిదారులను ఎంపిక వంటి అంశాలపైనా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పంట రుణాల మాఫీ, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీని మరింత విస్తరించే దిశగా చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది.
ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమి, పోడు భూముల క్రమబద్ధీకరణపై మంత్రివర్గంలో ప్రస్తావనకు రానుంది. వాటిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో పోస్టుల భర్తీకి క్లియరెన్స్ ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. కొత్త సచివాలయం, తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవ తేదీని ఈ కేబినెట్ లో ఖరారు చేయనున్నట్లు సమాచారం. రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ గా గవర్నర్ ను తొలగించే ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చిస్తుందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications