వేటికి అనుమతి.. వేటిపై నిషేధం.. తెలంగాణలో కొత్త గైడ్ లైన్స్ ఇవే..
కేంద్రం నిర్ణయం మేరకు తెలంగాణలోనూ లాక్ డౌన్ను మే 31వ తేదీ వరకు పొడగిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటివరకూ ఉన్నట్టే రాత్రి వేళ 7గం. నుంచి ఉదయం 6గం. వరకు కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. ఇక రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్స్ మినహా మిగతావన్నీ గ్రీన్ జోన్సే అని చెప్పారు. కంటైన్మెంట్ జోన్స్ పరిధిలో 1450 కుటుంబాలు ఉన్నాయన్నారు. ఆ ప్రాంతాల్లో ప్రభుత్వమే నిత్యావసరాలు పంపిణీ చేస్తుందని.. బయటివారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరని చెప్పారు. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నడుస్తాయని తెలిపారు.

బస్పులకు గ్రీన్ సిగ్నల్..
అంతరాష్ట్ర సర్వీసులు ఉండవని.. కేవలం రాష్ట్ర సరిహద్దుల్లోనే బస్సులు నడుస్తాయని తెలిపారు. బస్సుల్లో శానిటైజేషన్ తప్పనిసరిగా ఉంటుందన్నారు. అన్ని బస్సులు కోవిడ్-19 నిబంధనలను పాటిస్తాయన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో సిటీ బస్సులు నడవవని స్పష్టం చేశారు. అయితే నగరంలో జూబ్లీ బస్ స్టేషన్ నుంచి జిల్లా కేంద్రాలకు బస్సులు నడుస్తాయని చెప్పారు. ఎంజీబీఎస్ బస్ స్టేషన్ మాత్రం మూసివేసే ఉంటుందన్నారు. అలాగే నగరంలోఆటోలు,ట్యాక్సీలకు అనుమతిస్తున్నట్టు చెప్పారు. ఆటోల్లో 1+2,ట్యాక్సీల్లో 1+3 లెక్కన ప్రయాణికులకు అనుమతి ఉంటుందన్నారు. మెట్రో సర్వీసులపై నిషేధం కొనసాగుతుందన్నారు.

ఈకామర్స్,షాప్స్,మాన్యుఫాక్చరింగ్ యూనిట్స్..
రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల అన్ని షాపులు తెరుచుకుంటాయని చెప్పారు. అయితే హైదరాబాద్లో మాత్రం సరి-బేసి విధానం అమలవుతుందన్నారు.ఈకామర్స్ సంస్థలకు 100శాతం అనుమతిస్తున్నట్టు తెలిపారు. అలాగే అన్ని మాన్యుఫాక్చరింగ్ యూనిట్స్,పరిశ్రమలు 100శాతం ఉద్యోగులతో కార్యకలాపాలు సాగించవచ్చన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు,ప్రైవేట్ కార్యాలయాలకు కూడా 100శాతం ఉద్యోగులకు అనుమతిస్తున్నట్టు చెప్పారు. కంటైన్మెంట్ ప్రాంతాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా సెలూన్లకు అనుమతిస్తున్నామన్నారు.

విద్యా సంస్థలపై కొనసాగనున్న నిషేధం..
బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్ తప్పనిసరి అని.. లేకపోతే రూ.1000 జరిమానా తప్పదని హెచ్చరించారు. అన్ని రకాల విద్యా సంస్థలు మే 31 వరకు మూసివేయాల్సిందేనని చెప్పారు. బార్స్పబ్స్,క్లబ్స్,స్పోర్ట్స్,స్విమ్మింగ్ పూల్స్,జిమ్స్,స్టేడియం,పార్కులు కూడా మూసివేసే ఉంటాయన్నారు. సభలు,ర్యాలీలు,సమావేశాలపై నిషేధం కొనసాగుతుందన్నారు. అన్ని మతాల ప్రార్థన మందిరాలు మూసివేసే ఉంటాయని.. మతపరమైన ఉత్సవాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
Recommended Video

స్వీయ నియంత్రణ పాటించాలన్న సీఎం..
ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు ఇస్తుంది కదా అని పని లేకపోయినా అందరూ రోడ్ల పైకి వచ్చి హంగామా చేయవద్దని కోరారు. అలా చేస్తే తిరిగి పూర్తి లాక్ డౌన్ అమలుచేయాల్సిన పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరించారు. వృద్దులను గడప దాటనివ్వవద్దని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలిపారు. స్వీయ నియంత్రణ పాటిద్దాం.. కరోనా బారిన పడకుండా రక్షించుకుందాం అని పిలుపునిచ్చారు. ఇప్పటివరకూ ప్రజలంతా లాక్ డౌన్కు సహకరించారని.. ఇక ముందు కూడా ఇదే సహకారం అందించాలని కోరారు.












Click it and Unblock the Notifications