వరుసబెట్టి కీలక నిర్ణయాలు... త్వరలోనే ఉద్యోగులకు శుభవార్త చెప్పనున్న సీఎం కేసీఆర్...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల వరుసబెట్టి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇన్నాళ్లు పెండింగ్లో ఉంచిన అంశాలన్నింటినీ క్లియర్ చేసేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగాల భర్తీ కసరత్తును ప్రారంభించిన ప్రభుత్వం... నిన్ననే(డిసెంబర్ 27) రాష్ట్ర మహిళా కమిషన్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ప్రజలకు,ప్రభుత్వానికి భారంగా మారిన నియంత్రిత సాగు విధానాన్ని రద్దు చేసింది. ఇదే బాటలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఉద్యోగుల పీఆర్సీని ఈసారి ఎట్టకేలకు ప్రకటించే యోచనలో ఉన్నారు.

కొత్త సంవత్సర కానుకగా పీఆర్సీ...
కొత్త సంవత్సర కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ(పీఆర్సీ) అందించాలని కేసీఆర్ భావిస్తున్నారు. నిన్ననే(డిసెంబర్ 27) పీఆర్సీ ఫైల్ను కమిటీ నుంచి తెప్పించుకున్న కేసీఆర్... త్వరలోనే దానిపై సంతకం చేసే అవకాశం కనిపిస్తోంది. ఫిట్మెంట్ ప్రకటించడంతో పాటు పీఆర్సీ కమిటీ గడువును కూడా మరో 3 నెలల పాటు పొడగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఉద్యోగులకు కొత్త సర్వీసు నిబంధనల రూపకల్పనపై కమిటీ నుంచి మరో నివేదిక రావాల్సి ఉండటంతో కమిటీ గడువును మరోసారి పొడగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

డిసెంబర్ 30న ఖరారు చేసే అవకాశం...
డిసెంబర్ 31 వరకూ పీఆర్సీ కమిటీ గడువు ఉంది. మరో 3 నెలల పాటు గడువును పొడగించాల్సిందిగా పీఆర్సీ ఛైర్మన్ ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గడువును పొడగించే యోచనలో ఉన్న సీఎం... అంతకంటే ముందే ఉద్యోగులకు ఫిట్మెంట్ ప్రకటిస్తారని సమాచారం. ఇందుకోసం డిసెంబర్ 30న ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమై ఫిట్మెంట్ ఖరారు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ నెల నుంచి పెరగనున్న వేతనాలను ఉద్యోగులకు అందించనున్నారు.

ఈసారి కచ్చితంగా ప్రకటించే ఛాన్స్...
పీఆర్సీ బకాయిల చెల్లింపులపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. మే,2018లో పీఆర్సీ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటివరకూ 4 పర్యాయాలు దాని గడువు పొడగిస్తూ వచ్చారు. చివరిసారిగా గత ఫిబ్రవరి 18న గడువు పొడగించారు. ఇప్పటికే ఉద్యోగ సంఘాల్లో తీవ్రమైన అసంతృప్తి,అసహనం నెలకొనడంతో ఈసారి కచ్చితంగా పీఆర్సీ ప్రకటించే యోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రకటన ఎప్పుడు రావొచ్చు...
త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు,నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక ఉండటంతో ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే కేసీఆర్ పీఆర్సీ ప్రకటించవచ్చునన్న ప్రచారం జరుగుతోంది. న్యూ ఇయర్ కానుకగా ఈ ఏడాది చివరి లోపు లేదా వచ్చే జనవరి మొదటి వారంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు పీఆర్సీ పెండింగ్తో ఢీలా పడ్డ ఉద్యోగులకు ప్రస్తుతం ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నాలు కాస్త ఊరట కలిగిస్తున్నాయి.












Click it and Unblock the Notifications