కేంద్రమంత్రితో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక భేటీ..!!
యాదాద్రి భువనగిరి: తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లాలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఆసుపత్రిని కేంద్రమంత్రి మన్సుఖ్భాయ మాండవీయ సందర్శించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ను ప్రారంభించారు. దేశంలో వైద్యరంగాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు, ఇతర ప్రాజెక్టుల గురించి వివరించారు. ప్రత్యేకించి- ఆయుష్మాన్ భారత్ ప్రత్యేకత గురించి ఆయన ప్రస్తావించారు.
ఎయిమ్స్ తనిఖీ..
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. దేశంలో ప్రతి పౌరుడికీ తప్పనిసరిగా అత్యవసరమైన, ప్రాథమిక హక్కుగా భావించే వైద్య-ఆరోగ్య వసతులను కల్పించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని అన్నారు. వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి పలు ప్రాజెక్టులను చేపట్టామని వివరించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అన్ని సౌకర్యాలను కల్పించాలనేది తమ ఉద్దేశమని అన్నారు.
ఆయుష్మాన్ భారత్ కింద..
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైద్య-ఆరోగ్య రంగంలో దేశవ్యాప్తంగా మొత్తం 1.33 లక్షల ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మన్సుఖ్ మాండవీయ చెప్పారు. దీనికి రాష్ట్రాలు ఇచ్చిన సహకారాన్ని కూడా విస్మరించలేమిన అన్నారు. మారుమూల గ్రామీణులకు కూడా వైద్య సౌకర్యాన్ని కల్పించడానికి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ను అందుబాటులోకి తీసుకొచ్చామని ఆయన వివరించారు.
బల్క్ డ్రగ్ పార్కుల ఏర్పాటు..
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ బల్క్ డగ్ర్ పార్కులను ఏర్పాటు చేయడానికి చర్యలను తీసుకుంటున్నామని మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ఎయిమ్స్ బీబీనగర్ను తనిఖీ చేశారు. అక్కడి సిబ్బందితో మాట్లాడారు. వైద్య పరికరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించవద్దని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద అందే వసతులను గురించి వివరించారు.
స్వాగతం పలికిన కోమటిరెడ్డి..
అంతకుముందు- యాదాద్రి భువనగిరికి చేరుకున్నమన్సుఖ్ మాండవీయను స్థానిక లోక్సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలుసుకున్నారు. దగ్గరుండి స్వాగతం పలికారు. ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం కేంద్రమంత్రితో కలిసి బీబీనగర్కు బయలుదేరి వెళ్లారు. ఇద్దరూ కలిసి- బీబీనగర్ ఎయిమ్స్లో కలియ తిరిగారు.
ఎయిమ్స్ బీబీనగర్లో..
కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ ఫిరాయించే అవకాశాలు ఉన్నాయంటూ కొంతకాలంగా వార్తలు వస్తోన్న నేపథ్యంలో- ఆయనే స్వయంగా కేంద్రమంత్రి మన్సుఖ్ను స్వాగతం పలకడం ప్రాధాన్యతను సంతరించుకుంది. స్థానిక లోక్సభ సభ్యుడి హోదాలో కలిశారని చెబుతున్నప్పటికీ- అలాంటి సందర్భం ఇదివరకెప్పుడూ చోటు చేసుకోలేదు. వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే బీజేపీలో జాయిన్ అయ్యారు.
తాజా పరిణామంతో..
దేశ రాజధానిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనూ ఆయన భేటీ అయ్యారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రధాని అప్పాయింట్ మెంట్ కోరినట్లు వార్తలొచ్చాయి అప్పట్లో. జాతీయ రహదారుల విస్తరణపైన జాతీయ సంస్థలను జిల్లాకు కేటాయించడం వంటి అంశాలపై చర్చించారని తెలిసింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ముందు నుంచీ వ్యతిరేకిస్తూ వస్తోన్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమౌతోంది.