లవర్ పార్కులు కాదు.. ఆక్సిజన్ పార్కులు.. గ్రేటర్ పరిధిలో మరో 9
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆక్సిజన్ పార్కులు ప్రజాదరణ పొందుతున్నాయి. అర్బన్ లంగ్స్ స్పేస్ పేరుతో పిలిచే పార్కులు.. నగరవాసులకు ఆహ్లాదంతో పాటు స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నాయి. సువిశాలమైన విస్తీర్ణంలో రకరకాల చెట్లతో ప్రాణ వాయువు అందిస్తున్న ఆక్సిజన్ పార్కులకు జనాలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలుచోట్ల అర్బన్ లంగ్స్ స్పేస్ ఏర్పాటు చేయగా.. రానున్న ఏడాదిలో వాటి సంఖ్య మరింత పెంచేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
హైదరాబాద్లో భారీగా సెక్స్ డ్రగ్స్.. కిలోలకొద్దీ బయటపడుతున్న కెటామిన్
కాలుష్యం బారి నుంచి తప్పించేలా..!
యాంత్రిక జీవనంలో ఉరుకులు పరుగులతో కుస్తీ పడుతున్న నగరవాసులకు ఆహ్లాదం పంచడం కోసం ఉద్దేశించిన ఆక్సిజన్ పార్కులు మంచి ఫలితాలే ఇస్తున్నట్లు కనిపిస్తోంది. అర్బన్ లంగ్స్ స్పేస్ తో పిలుస్తున్న ఈ పార్కుల్లో స్వచ్ఛమైన గాలి లభిస్తోంది. వివిధ రకాల చెట్లను పెంచుతూ అటవీశాఖ అధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి సారించారు. హరితహారంలో భాగంగా ఆక్సిజన్ పార్కులను అభివృద్ధి చేస్తూ నగరవాసులకు కొత్త అనుభూతి పంచుతున్నారు.
75 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్లో ఏర్పాటు చేసిన కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ సందర్శకులను ఆకట్టుకుంటోంది. యాంత్రిక జీవనానికి దూరంగా, విషవాయువుల జాడ లేని స్వచ్ఛమైన గాలి ఇక్కడ గ్యారంటీగా దొరుకుతుందని చెప్పొచ్చు. వివిధ రకాల పూల, పండ్ల చెట్లలతో పాటు ఔషధ మొక్కలు ఉండటం ఈ పార్క్ ప్లస్ పాయింట్. మర్రి, రావి, ఉసిరి, చింత, నెమలినార, సీతాఫలం తదితర చెట్లు ఇక్కడ దర్శనమిస్తాయి.
ఆరోగ్యవంతమైన ఊపిరితిత్తుల కోసం..!
ప్రజలకు ఆహ్లాదం పంచడం.. పర్యావరణాన్ని పరిరక్షించడం.. ఆక్సిజన్ పార్కుల ఏర్పాటు వెనుక కనిపించే ఉద్దేశాలు. ఇప్పటికే నాలుగు పార్కులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. కండ్లకోయలో ఆక్సిజన్ పార్కు, మేడిపల్లి ఫారెస్టు బ్లాకులో శాంతివనం.. దూలపల్లి ఫారెస్టు బ్లాకులో ప్రశాంత వనం, నారపల్లిలో నందన వనం పార్కులు.. నగరవాసులకు ఆహ్లాదం పంచడంతో పాటు స్వచ్ఛమైన గాలి అందిస్తున్నాయి.
ఆక్సిజన్ పార్కులకు ప్రజల నుంచి కూడా ఆదరణ లభిస్తోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ కోసం, వ్యాయామం చేయడానికి అనువుగా వీటిని ఎంచుకుంటున్నారు. అలాగే పిక్నిక్ స్పాట్ మాదిరిగా ఎన్నో కుటుంబాలు ఈ పార్కులకు వచ్చి సేద దీరుతున్నాయి. అయితే వీటి నిర్వహణ కోసం సందర్శకుల నుంచి నామమాత్రపు ఛార్జీలు మాత్రమే తీసుకుంటున్నారు.
నెలరోజుల్లో మరో మూడు..!
అదలావుంటే మరో మూడు పార్కులను అతి త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా అటవీశాఖ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నాగారం, నారపల్లి, బహదూర్పల్లి ప్రాంతాల్లో ఆక్సిజన్ పార్కుల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఒక్కో పార్కు నిర్మాణానికి దాదాపు 50 లక్షల రూపాయల మేరకు జిల్లా అటవీ శాఖ పద్దుల నుంచి వెచ్చించనున్నట్లు సమాచారం.
వివిధ శాఖల సమన్వయం.. కొత్త పార్కుల ఏర్పాటు
ఈ సంవత్సరంలో ఆక్సిజన్ పార్కులు మరిన్ని పెంచేలా జిల్లా అటవీ శాఖ అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే మరికొన్ని ప్రాణ వాయువు పార్కులు అందుబాటులోకి రానున్నాయి. వివిధ శాఖల సమన్వయంతో వీటిని వీలైనంత త్వరగా పూర్తిచేయాలనే టాస్క్ పెట్టుకున్నట్లు సమాచారం. మొత్తం 9 పార్కులను అభివృద్ధి చేసే దిశగా వర్కవుట్ జరుగుతున్నట్లు వినికిడి.
టీఎస్ఎఫ్డీసీ ఆధ్వర్యంలో మూడు పార్కులు రానున్నాయి. గౌడవెళ్లి, తూముకుంట, లాల్గడ్ మలక్పేట్ పరిధిలో అర్బన్ లంగ్స్ స్పేస్ పార్కులు ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతున్నారు. అలాగే జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో గాజుల రామారం, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో తుర్కపల్లి ప్రాజెక్టులు సిద్ధం కానున్నాయి. ఇక తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో యాద్గార్ పల్లి, కీసర, ధర్మారం-ఉప్పరపల్లి ప్రాంతాల్లో.. అలాగే టీఎస్ఐఐసీ నేతృత్వంలో ఎల్లంపేట్లో మరో పార్కు రూపుదిద్దుకోనుంది.