TSRTC Strike: ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం: అశ్వద్ధామ రెడ్డి స్పందన ఇది
హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ సమ్మె విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తప్ప.. ఇతర డిమాండ్లను పరిశీలించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. డిమాండ్లపై ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని వేసింది.
ఆ ఒక్కటీ తప్ప..
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ ను కార్మిక సంఘాలు తామంతట తామే వదులుకున్నాయని పేర్కొంది. ప్రభుత్వంలో విలీనం మినహా మిగితా డిమాండ్లను పరిశీలించడానికి ఆర్టీసీ ఈడీలతో ఆర్టీసీ ఎండీ కమిటీని నియమించారు. హైకోర్టు సూచించిన 21 డిమాండ్లను పరిశీలించనున్నట్లు తెలిసింది.
హైకోర్టుకు నివేదిక..
కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా హైకోర్టుకు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
అన్ని డిమాండ్లు పరిశీలించాల్సిందే..
ప్రభుత్వం నిర్ణయంపై ఆర్టీసీ సంఘాల నేత, జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి స్పందించారు. తాము ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ను తాము వదులుకోలేదని అన్నారు. చర్చలు అన్నప్పుడు అన్ని అంశాలు పరిశీలించాలని అన్నారు. 26 డిమాండ్లను తీర్చాల్సిందేనని అశ్వద్ధామ రెడ్డి స్పష్టం చేశారు.
18రోజులుగా..
కాగా, తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆర్టీసీ కార్మికులు అక్టోబర్ 5 నుంచి సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం నాటికి సమ్మె 18 రోజులకు చేరుకుంది. సమ్మె కారణంగా ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు వ్యక్తులతో బస్సులను నడిపిస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో వాహనాలు ప్రయాణికులకు అందుబాటులోకి రాలేదు.