సీజేఐ ఎన్వీ రమణ కీలక నిర్ణయం: తెలంగాణ హైకోర్టులో జడ్జీల సంఖ్య 24 నుంచి 42కు పెంపు
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలన్న అభ్యర్థనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆమోదం తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో 24 మంది న్యాయమూర్తులు ఉండగా, ఆ సంఖ్యను 42కు పెంచుతూ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు.
న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని కోరుతూ తెలంగాణ హైకోర్టు నుంచి రెండేళ్లుగా సుప్రీంకోర్టుకు అనేక విజ్ఞప్తులు చేరాయి. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం సుప్రీంకోర్టు కొలీజియం ద్వారా జరుగుతుంది. దీంతో వివిధ రాష్ట్రాల హైకోర్టుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను జస్టిస్ ఎన్వీ రమణ పరిశీలిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తెలంగా హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను ఏకంగా 75 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇకపై తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 42కు చేరనుంది. హైకోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను సాధ్యమైనంత త్వరితగతిన పూర్తి చేయాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీజేఐ కార్యాలయం వెల్లడించింది.
ఇటీవల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో సీజేఐ ఎన్వీ రమణ రెండ్రోజులపాటు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా భేటీ అయిన విషయం తెలిసిందే. కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కాగా, తాజాగా, జడ్జీల సంఖ్యను పెంచడం పట్ల తెలంగాణ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.